ముఖేష్ అంబానీ అంతకంతకూ పడిపోతున్నారు!! ఎందుకిలా జరిగింది
మొన్నటి వరకు ఆసియా కుబేరుడిగా నిలిచిన ముఖేష్ అంబానీ కొత్త సంవత్సరంలో కిందకు పడిపోయారు. కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి చివరి వారంలో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ దారుణంగా పతనమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో సూచీలు రికవరీ అయ్యాయి. గత రెండు నెలల కాలంలోనే సెన్సెక్స్ ఏకంగా 7000 పాయింట్లకు పైగా ఎగిసింది. అంతకుముందు సూచీలు గరిష్టాన్ని తాకడంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పాత్ర ఎంతో ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఇది పడిపోతోంది.
2 నెలల్లోనే సెన్సెక్స్ 7000 జంప్, 37 స్టాక్స్ అదరగొట్టాయి
ప్రపంచ 4వ కుబేరుడిగా...
నవంబర్ ముందు వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో ముఖేష్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో టాప్ 5లోకి చేరుకున్నారు. ఓ సమయంలో ఆయన సంపద 90 బిలియన్ డాలర్ల సమీపానికి చేరుకుంది. దీంతో ఆయన బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీల్లో 4వ ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. నవంబర్ తర్వాత నుండి ఈ స్టాక్ క్రమంగా పతనం అవుతోంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.
ఆ స్థానాలు కోల్పోయాడు
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర సెప్టెంబర్ 2020లో ఓ సమయంలో రూ.2368.80 ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. రిలయన్స్ షేర్ ఈ రోజు రూ.1900 దిగువకు పడిపోయింది. ఈ రోజు 1.78 శాతం లేదా రూ.34.70 క్షీణించి రూ.1899 వద్ద క్లోజ్ అయింది. ఇప్పటి వరకు ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్టం నుండి 20 శాతం వరకు పడిపోయింది. మూడు నెలల క్రితం 90 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్న ముఖేష్ అంబానీ ఇప్పుడు 73.9 బిలియన్ డాలర్లకు పడిపోయారు. అంతేకాదు, టాప్ 10 కుబేరుల జాబితా నుండి వెలుపలకు రావడంతో పాటు, ఆసియా కుబేరుడి స్థానాలు కోల్పోయారు.
ఎందుకిలా పడిపోయింది...
రిలయన్స్ స్టాక్ టార్గెట్ రూ.2250గా ఇప్పటికీ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ తన ఈ-కామర్స్, టెక్నాలజీ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాయని ఇది మున్ముందు ఉపకరిస్తుందని చెబుతున్నారు. అయితే టెలికం టారిఫ్ మొదలు చమురు ఉత్పత్తి ప్రభావం ఈ స్టాక్స్ పైన పడిందని అంటున్నారు. అలాగే ఇటీవల ఫ్యూచర్ గ్రూప్ అంశంలో అమెజాన్ ప్రభావం కాస్త పడిందని అంటున్నారు.