ఐపీవోకు హైదరాబాద్ కేంద్రంగా పని చేసే MTAR: మొత్తం కోటికి పైగా షేర్లు
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ ఎంటీఏఆర్ (MTAR) టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ(IPO)కు వస్తోంది. ఇందుకు సంబంధించి మార్కెట్ స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి SEBIకి దరఖాస్తు చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.600 నుండి రూ.650 కోట్ల వరకు నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఐపీవో ద్వారా 40 లక్షల షేర్లను జారీ చేయనుంది. వీటితో పాటు ప్రమోటర్లు, ఇతర వాటాదారులకు సంబంధించిన 82,24,270 షేర్లను ఆఫర్ ఫర్ సేల్లో విక్రయిస్తారు. ఈ నిధులను రుణాల చెల్లింపులు, దీర్ఘకాలికంగా వ్యాపార నిర్వహణ కోసం వినియోగించనున్నారు.
భారీ రిటర్న్స్ ఇచ్చిన టెస్లా, ఏడాదిలో 700% జంప్: జెఫ్ బెజోస్ను దాటివేసే దిశగా ఎలాన్ మస్క్
ఇదీ MTAR ప్రత్యేకత
MTAR టెక్నాలజీస్ న్యూక్లియర్, రక్షణ, వార్ రియాక్టర్లు, ఏరోస్పేస్ ఇంజిన్, అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించే 14 రకాలైన యంత్ర విడిభాగాలను తయారు చేస్తోంది. ఈ విడిభాగాలను పీఎస్ఎల్వీ-సీ25, జీఎస్ఎల్వీ మార్క్ 7, మార్స్ ఆర్బిటార్ మిషన్ స్పేస్ క్రాఫ్ట్, మంగళ్యాన్, చంద్రయాన్ వంటి ప్రాజెక్టులకు అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు యూనిట్లను కలిగి ఉంది. నాలుగు దశాబ్దాలుగా ఇంజినీరింగ్ విభాగంలో సేవలు అందిస్తోంది.
హైదరాబాద్లో యూనిట్
దేశవ్యాప్తంగా ఏడు యూనిట్లను కలిగి ఉన్న MTAR సంస్థకు హైదరాబాద్లో ఎగుమతుల కోసం ప్రత్యేక యూనిట్ ఉంది. భాగ్యనగరం పరిసరాల్లోని ఆదిభట్లలో కొత్తగా షీట్ మెటల్ యూనిట్ను నెలకొల్పే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం MTARకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్తో పాటు అమెరికాకు చెందిన బ్లూమ్ ఎనర్జీ కార్పోరేషన్ క్లయింట్స్. గత నెల నాటికి రూ.356 కోట్లకు పైగా ఆర్డర్స్ చేతిలో ఉన్నాయి.
మొత్తం 1.22 కోట్ల షేర్లు
కంపెనీ రూ.10 ముఖ విలువ కలిగిన రూ.40 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. ఆఫర్ సేల్ కింద 82 లక్షలకు పైగా షేర్లను విక్రయిస్తోంది. మొత్తం 1,22,24,270 షేర్లు ఐపీవో ద్వారా ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగం టర్నోవర్లో దేశీయ అమ్మకాల ఆదాయం 47.29 శాతం, ఎగుమతులు 52.71 శాతంగా ఉన్నాయి. ఐపీవో ద్వారా లభించిన మొత్తంలో రూ.55 కోట్లు అప్పులు తీర్చి, రూ.95 కోట్లను దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవసరాలకు కేటాయించనుంది.