లోన్ యాప్స్ చాలా వరకు రిజిస్టర్ చేసుకోలేదు, ఇబ్బంది పెడితే...
రిజిస్టర్ కానీ డిజిటల్ లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) హెచ్చరించింది. అన్-రిజిస్టర్డ్ లోన్ యాప్స్ నుండి అప్పులు తీసుకున్న కస్టమర్లు ఏవైనా సమస్యలు ఎదురైతే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం సూచించారు. అప్పుడు చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
డిజిటల్ లోన్ యాప్ సిబ్బంది, ఏజెంట్ల వేధింపుల కారణంగా పలువురు రుణగ్రహీతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్బీఐ స్పందించింది. ఎక్కువ శాతం లోన్ యాప్స్ ఆర్బీఐ వద్ద నమోదు కాకుండా కార్యకలాపాలు సాగిస్తున్నాయన్నారు. కస్టమర్ల సమస్యలపై స్థానిక పోలీసులు విచారణ చేసి, చర్యలు తీసుకుంటారన్నారు.
ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయిన యాప్స్ వివరాలు వెబ్ సైట్లో ఉంటాయి. ఈ యాప్స్ నుండి వేధింపులకు పాల్పడినా, ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామన్నారు. చాలా వరకు ఈ-లెండింగ్ యాప్స్ తమ వద్ద రిజిస్టర్ కాలేదన్నారు. పేసెన్స్, మనీట్యాప్, ధని, నీరా, క్యాష్ఈ, మనీవ్యూ వంటి తదితర లోన్ లెండింగ్ యాప్స్ ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయ్యాయి.