Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థపై తాజా రిపోర్ట్.. మోర్గాన్ స్టాన్లీ అంచనాలు.. దశాబ్దకాలం..
Indian Economy: గత కొన్ని నెలలుగా దేశంలో అనేక మందికి భారత ఆర్థిక వ్యవస్థపై అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. రాజకీయంగాను ఈ అంశం వివాదాలకు నిలయంగా మారింది. అయితే భారత ఆర్థిక వ్యవస్థకు ఒక శుభవార్త ఉంది.
మోర్గాన్ స్టాన్లీ అంచనాలు..
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. 2022-23లో భారత ఆర్థిక వ్యవస్థ ఆసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ సగటున 7 శాతంగా అంచనా వేయబడిందని, ఇది ఆసియా దేశాల్లోని ఆర్థిక వ్యవస్థల్లో అత్యధికంగా ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొంది.
కారణం ఏమిటంటే..?
మోర్గాన్ స్టాన్లీ భారత ఆర్థిక వ్యవస్థ పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఒక దశాబ్దానికి పైగా అత్యుత్తమ పనితీరుకు సిద్ధంగా ఉందని నివేదిక పేర్కొంది. కరోనా కారణంగా నిలిచిపోయిన డిమాండ్ తిరిగి గాడిన పడటమే ఇందుకు కారణంగా నివేదిక వెల్లడించింది. వస్తువుల ధరలను సడలించడం, లాక్ డౌన్ తరువాత ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకోవటం డిమాండ్ను పెంచుతున్నాయి. మెుబిలిటీ కరోనా ముందు స్థాయిలకు చేరుకోవటంతో.. వేగంగా ఆర్థిక పునరుద్ధరణకు దారితీస్తుందని పేర్కొంది.
ఆ దేశాల కంటే మెరుగ్గా భారత్..
ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. భారత GDP FY-2022లో 7.4, 2023లో 6.1గా ఉండవచ్చని అంచనా వేసింది. ఇది అమెరికా, యూరప్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ వంటి ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని వెల్లడించింది. తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ గ్రోత్ ప్రొజెక్షన్లో 2021లో భారతదేశం ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2021లో ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత GDP 8.7 శాతం వృద్ధితో అగ్రస్థానంలో ఉంది.
సానుకూలంగా ప్రభుత్వం..
2023 ఆర్థిక సంవత్సరంలో భారత GDP-7.5 శాతం వృద్ధి చెందుతుందని, ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అదే సమయంలో లోక్సభలో విపక్షాల ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తూ.. దేశంలో మాంద్యం అనే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. లోక్సభలో ద్రవ్యోల్బణంపై చర్చ సందర్భంగా.. కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సరఫరా గొలుసులో అంతరాయాలు ఉన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అన్నారు.