మాకు నచ్చలేదు: నిర్మలమ్మ బడ్జెట్ 2020పై ఐకియా
స్వీడన్ కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ రిటైలింగ్ కంపెనీ ఐకియా... కేంద్ర బడ్జెట్ పై పెదవి విరిచింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత మాత్రం అనుకూలంగా లేదని ఐకియా ప్రకటించింది. ఎందుకంటే.. కేంద్ర బడ్జెట్ లో ఫర్నిచర్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాలను విపరీతంగా పెంచేశారు. 'యూనియన్ బడ్జెట్ లో కస్టమ్స్ సుంకాలను పెంచటం ఐకియాను నిరుత్సహపరిచింది. ఇది ఫర్నిచర్ తో పాటు ఇతర కిచెన్ ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపగలదు' అని ఐకియా ఇండియా సీఈఓ పీటర్ బెట్జల్ వ్యాఖ్యానించారు.
ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అసలు విషయం ఏమిటంటే ఐకియా ప్రస్తుతం ఇండియాలో తయారు చేసే ఫర్నిచర్, కిచెన్ వేర్ ఉత్పత్తుల్లో సింహభాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందుకే, కస్టమ్స్ డ్యూటీ పెంచితే దాని వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఐకియా ఇండియాలో అమ్మకాలు చేపట్టడంతో పాటు, ఇక్కడి నుంచి విదేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. దీంతో ఇప్పుడు ఈ కంపెనీ ఎగుమతులు కూడా ప్రియం కానున్నాయి.
75% దిగుమతులు..
ఐకియా ఇండియా ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇండియాలో కార్యకలాపాలు సాగిస్తోంది. 30 ఏళ్లుగా ఇండియా లో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ ప్రక్రియలో కంపెనీ సుమారు 75% మేరకు ఫర్నిచర్, కిచెన్ వేర్ సహా ఇతర ముడిసరుకులు ఇండియాకు దిగుమతి చేసుకుంటుంది. అందుకే ఇప్పుడు పెరిగిన కస్టమ్స్ సుంకం వల్ల కంపెనీకి వ్యయాలు పెరుగుతాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లలోకి మళ్ళీ ఇక్కడి నుంచి చేసే ఎగుమతుల ధరలు కూడా ఆ మేరకు పెరుగుతాయి. అప్పుడు దానికి అనుగుణంగా మొత్తం తన ఉత్పత్తుల ధరలను పెంచాల్సివస్తుంది. ఈ పరిణామం వల్ల గ్లోబల్ లెవెల్ లో ఐకియా బిజినెస్, అమ్మకాలు ప్రభావితం అవుతాయి. అందుకే అంతలా కలత చెందుతోంది.
భారీగా పెరిగిన సుంకం...
ప్రస్తుతం ఐకియా ఇండియా ప్రధానంగా మూడు రకాల ప్రొడక్టులను దిగుమతి చేసుకుంటోంది. అందులో ఫర్నిచర్ దిగుమతులపై కస్టమర్స్ సుంకం 20% నుంచి 25% నికి పెరిగింది. మరోవైపు కిచెన్ వేర్ ఉత్పత్తుల పై సుంకాలను 10% నుంచి 20% పెంచారు. అంటే రెట్టింపు ఐంది. ఇకపోతే ఐకియా విక్రయించే టాయ్స్ పైన కూడా కస్టమ్స్ సుంకం భారీగా పెరిగింది. ఇది ఏకంగా 20% నుంచి 60% పెరిగింది. దీంతో ఐకియా ఇండియా తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. ఇండియా లో కనీసం 30% ముడి సరుకులను కొనుగోలు చేయాలనీ ఐకియా లాంటి సింగల్ బ్రాండ్ రిటైల్ సంస్థలకు నిబంధనలు ఉన్నాయి. అయితే, అవి దీర్ఘకాలికమైన ఆలోచనలు అని, భారత్లో సోర్సింగ్ కు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నప్పటికీ... ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు మారకూడదని పీటర్ అభిప్రాయపడ్డారు.
రూ 10,000 కోట్ల పెట్టుబడులు...
ఐకియా ఇండియా మన దేశంలో సుమారు రూ 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు పొందింది. ఇప్పటికే రూ 700 కోట్లు వెచ్చించి హైదరాబాద్ లో తన తొలి ఇండియా స్టోర్ ను నెలకొల్పింది. త్వరలోనే ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా స్టోర్ల ను తెరిచే ప్రయత్నాల్లో ఉంది. అయితే, ఇప్పుడు దీనికి కొత్త చిక్కొచ్చి పడింది. కస్టమ్స్ సుంకం పెంపుతో దాదాపు అన్నిరకాల ప్రొడక్టుల ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇది ఇండియాలో ఐకియా కార్యకలాపాలు, విస్తరణపై కూడా ప్రభావం చూపగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ స్టార్లే కాకుండా చిన్న స్టోర్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.