లోన్ మారటోరియం అవసరం లేదు: తేల్చిచెప్పిన ఆర్బీఐ, 15 నుండి బాండ్స్ కొనుగోలు
కరోనా మహమ్మారి నేపథ్యంలోదేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నప్పటికీ రుణాల చెల్లింపులకు మారటోరియం సదుపాయాన్ని మళ్లీ ప్రకటించవలసిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే 6 నెలల మారటోరియం కాలంలో రుణగ్రహీతల నుండి వసూలు చేసిన వడ్డీపై వడ్డీని తిరిగి ఇచ్చేందుకు బోర్డు ఆమోదిత విధానాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకు రావాలని బ్యాంకులకు, NBFCలను ఆర్బీఐ ఆదేశించింది. వడ్డీపై వడ్డీని రిఫండ్ చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ దిశగా సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది.
కరోనా టైంలో ఈ ఉద్యోగాలు అదరగొట్టాయి, కారణాలివే..
రాష్ట్రాలకు రుణ పరిమితి
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు (వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్/ WMA) తీసుకునే రుణాల పరిమితిని రూ.47,000 కోట్లకు పెంచింది ఆర్బీఐ. ప్రస్తుతం ఉన్న రూ.32,225 కోట్ల పరిమితితో పోలిస్తే ఇది 46 శాతం అధికం. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రకటించిన రూ.51,560 కోట్ల తాత్కాలిక WMA పరిమితిని సెప్టెంబర్ 30 వరకు కొనసాగిస్తారు. అదనపు ప్రత్యేక నిధుల లభ్యత కింద నాబార్డ్కు రూ.25,000 కోట్లు, ఎన్హెచ్బీకి రూ.1000 కోట్లు, సిడ్బీకి రూ.15000 కోట్లు అందిస్తారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఏప్రిల్-జూన్ కాలంలో 26.2 శాతం, జూలై-సెప్టెంబర్లో 8.3 శాతం, అక్టోబర్-డిసెంబర్లో 5.4 శాతం, జనవరి-మార్చిలో 6.2 శాతంగా వృద్ధి నమోదు కావొచ్చునని అంచనా వేసింది. ద్రవ్యోల్భణ నియంత్రణ టార్గెట్లోనే ఉంటుందని, దీనిని ఎప్పడూ గమనిస్తామని తెలిపింది.
బాండ్స్ కొనుగోలు
కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఏప్రిల్-జూన్ కాలంలో రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్స్ను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇందుకుగా సెకండ్ మార్కెట్ జీ-సెక్ అక్విజిషన్ ప్రోగ్రామ్ (జీ-ఎస్ఏపీ 1.0)ను ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్ 15 నుండి మొదటి విడత బాండ్స్ కొనుగోలును ప్రారంభిస్తామని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 లక్షల కోట్ల బాండ్స్ను ఆర్బీఐ కొనుగోలు చేయగా, ఈసారీ అంత/అంతకంటే అధికంగా కొనుగోలు చేయొచ్చు.
కీలక నిర్ణయాలు
రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను వరుసగా అయిదోసారి ఆర్బీఐ యథాతథంగానే కొనసాగించిం ది. గత నాలుగు ద్రవ్యసమీక్షల్లో వీటి జోలికి వెళ్లని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఈసారి కూడా యథాతథ వడ్డీపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది రెపోను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ కీలక నిర్ణయాలు... రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతం, 2021-22లో జీడీపీ అంచనా 10.5 శాతం, రిటైల్ ద్రవ్యోల్భణం 4.4 శాతం నుండి 5.2 శాతంగా అంచనా. 2021-22 రుణాల కోసం నాబార్డు, NHB, సిడ్బీలకు రూ.50వేల కోట్ల అదనపు నిధులు, పేమెంట్స్ బ్యాంకుల కోసం ప్రతి కస్టమర్ గరిష్ట బ్యాలెన్స్ పరిమితి రూ.1 లక్ష కోట్ల నుండి రూ.2 లక్షల కోట్లు.