18 ఏళ్లలో భారీ నష్టం, షేర్స్ డౌన్: జపాన్ కంపెనీకి కరోనా దెబ్బ, మిత్సుబిషి 'పేజరో' కనుమరుగు
కరోనా మహమ్మారి అన్ని రంగాలను భారీగా దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా వాహనాల సేల్స్ అయితే దారుణంగా పడిపోయాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే రికవరీకి మరింత సమయం పట్టనుంది. ఈ పరిస్థితుల్లో ఖరీదైన కార్లు వంటి వాహనాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో ఈ కరోనా దెబ్బతో జపాన్ కంపెనీ మిత్సుబిషికి చెందిన పేజరో ఎస్యూవీ కనుమరుగు కానుంది.
74 లక్షల షేర్లు విక్రయించిన ఆదిత్యపురి, HDFC షేర్లు ఢమాల్! బ్యాంకు ఏం చెప్పిందంటే..
పేజరో ఎస్యూవీ కనుమరుగు
ఈ మిడిల్ శ్రేణి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం తయారీని 2021 నుండి నిలిపివేయనున్నట్లు మిత్సుబిషి మోటార్స్ ప్రకటించింది. గత ఏడాది మందగమనం, ఈసారి కరోనా దెబ్బ భారీగా పడింది. గత రెండేళ్లలో భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించింది. స్పోర్ట్స్ కార్ల విభాగంలో పేజరో ఎస్యూవీ ఎంతోమందిని ఆకట్టుకుంది. అత్యంత కఠినమైనదిగా భావించే డాకర్ ర్యాలీలో కార్ల విభాగంలో 2001 నుండి 2005 వరకు ఈ వాహనం వరుస విజయాలు సాధించింది. గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇప్పటి వరకు దీనిని ఎవరూ సమం చేయలేదు.
18 ఏళ్లలో భారీ నిర్వహణ నష్టం
జపాన్కు చెందిన మిత్సుబిషి సేల్స్ కరోనా కారణంగా ఈసారి మరింతగా పడిపోయాయి. కీలకమైన సౌత్ ఈస్ట్ ఏషియా మార్కెట్లో సేల్స్ దారుణమైన సేల్స్ చూసింది. ఈ ఆర్థిక సంవత్సరం భారీ నష్టాలు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మిత్సుబిషి షేర్లు ఈ రోజు (మంగళవారం, 28) ఎన్నడూ లేని విధంగా 10 శాతం పడిపోయాయి. కరోనా కారణంగా మార్చి 31, 2021తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి 140 బిలియన్ యెన్ల(1.33 బిలియన్ డాలర్లు) నష్టాన్ని అంచనా వేస్తోంది. 2002 తర్వాత అంటే 18ఏళ్ల తర్వాత అత్యంత నిర్వహణ నష్టాన్ని చవిచూడనుందని అంచనా. దీంతో పేజరో ఎస్యూవీ ఉత్పత్తిని నిలిపివేస్తోంది.
అందుకే పేజరో ఎస్యూవీ ఉత్పత్తి నిలిపివేత
కరోనా కారణంగా వాహనాల విక్రయాలు తగ్గిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం లిస్టింగ్ అయిన మిత్సుబిషి పద్దెనిమిదేళ్ల తర్వాత భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. దీంతో సంస్థను నిలబెట్టే చర్యల్లో పేజరో ఎస్యూవీ ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించంది. జపాన్లో ఉన్న సంబంధిత ప్లాంట్ క్లోజ్ కానుంది. యూరోప్, ఉత్తర అమెరికాల్లో తన కార్యకలాపాలను తగ్గించుకొని ఆసియాపై మరింతగా దృష్టి సారించాలని నిర్ణయించింది.
మిత్సుబిషి ఫలితాలు షాక్
మిత్సుబిషి మోటార్స్ ఫలితాలు షాక్ ఇచ్చాయని లైట్ స్ట్రీమ్ రీసెర్చ్ అనలిస్ట్ మియో కాటో అన్నారు. మిత్సుబిషి షేర్లు ఓ సమయంలో 12 శాతం నష్టపోయి 240 యెన్లకు తక్కువకు పడిపోయాయి. 1988లో లిస్టింగ్ అయినప్పటి నుండి ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. చైనా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ కంపెనీకి నాలుగొంతుల వాటా ఉంది. కానీ కరోనా కారణంగా ఇటీవల ఇక్కడ పడిపోయాయి.