ముఖేష్ అంబానీ జియోలోకి మరో భారీ పెట్టుబడి? మైక్రోసాఫ్ట్తో చర్చలు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్కు చెందిన జియో ప్లాట్ఫామ్స్లోకి గత నెల రోజులుగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రిలయన్స్ను రుణరహిత కంపెనీగా మార్చే లక్ష్యంలో భాగంగా జియో ప్లాట్ఫామ్స్లో వాటాలు విక్రయిస్తున్నారు. నాలుగు వారాల్లోనే రూ.78వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఇన్వెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖేష్ అంబానీ దూకుడు: జియోలో KKR రూ.11,367 కోట్ల పెట్టుబడి, నెలలో ఐదో భారీ ఇన్వెస్ట్మెంట్
జియో ప్లాట్ఫామ్స్లలో 2.5 శాతం వాటా
జియో ప్లాట్ఫామ్స్లలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల నిమిత్తం మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద రిలయన్స్కు జియో ప్లాట్ఫామ్ డిజిటల్ యూనిట్. 'పలు డిజిటల్ పేమెంట్స్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో 2.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తిగా ఉంద'ని చెబుతున్నారు.
చర్చలు సఫలమైతే...
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియోలో సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్న మైక్రోసాఫ్ట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, తుది ఒప్పంద వివరాలు రాబోయే కొద్ది రోజుల్లో వెల్లడి కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ చర్చలు సఫలమైతే ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థ.. జియో ప్లాట్ఫాంలో వాటాలు కొనుగోలు చేసినట్లవుతుంది.
సత్య నాదెళ్ల వ్యాఖ్యలు
ఫిబ్రవరిలో తన భారత దేశ పర్యటన సందర్భంగా సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. తమ సేవలను మరింత విస్తరిస్తామన్నారు. ప్రధానంగా అజూర్ క్లౌడ్ సేవలను క్యాష్ చేసుకోవటానికి ఇండియా అంతటా డేటా సెంటర్లను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తాజా చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది.
జియోలోకి పెట్టుబడులు
ఇటీవల జియోలోకి పెట్టుబడులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. జియో-ఫేస్బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఈ పెట్టుబడితో ఫేస్బుక్ 9.99 శాతం వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్నర్స్.. జియో ప్లాట్ఫామ్స్లో 1% వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత విస్తా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3 శాతం వాటాను, జనరల్ అట్లాంటిక్ పార్ట్నర్స్ రూ.6,598.38 కోట్ల పెట్టుబడితో 1.34 శాతం వాటాను కొనుగోలు చేశాయి. ఇటీవల కేకేఆర్ రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. వీటి ద్వారా 10 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.78,562 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.