Internet Explorer: ఆ బ్రౌజర్కు బైబై: శాశ్వతంగా బంద్
వాషింగ్టన్: ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో అందరికీ సుపరిచితమైన బ్రౌజర్.. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దీన్ని అభివృద్ధి చేసింది. కాలక్రమేణా దాని ప్రభావం తగ్గింది. గూగుల్ రంగ ప్రవేశం చేసిన తరువాత.. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ పూర్తిగా మరుగున పడింది. ఇప్పుడిక శాశ్వత నిద్రలోకి జారుకుంది.
ఇంటర్నెట్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇవ్వాళ్టి నుంచి ఆ బ్రౌజర్ ఇక పని చేయదు. ఐఈ 11 డెస్క్టాప్ అప్లికేషన్స్, విండోస్ 8.1, విండోస్ 7 ఈఎస్యూ, విండోస్ ఎస్ఏసీ, విండోస్ 10 ఎల్ఓటీ ఎల్టీఎస్సీల్లో మార్పు చేయట్లేదు. అవి ఎప్పట్లా కొనసాగుతాయి.
తొలిసారిగా 1995లో ఇది తెరమీదికి వచ్చింది. 27 సంవత్సరాల పాటు సేవలను అందించింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వాటన్నింట్లోనూ ఓల్డెస్ట్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. 1995లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ను తొలిసారిగా ఆవిష్కరించింది మైక్రోసాఫ్ట్. విండోస్ 95తో పాటుగా దీన్నీ మనుగడలోకి తీసుకొచ్చింది.
తమ డెస్క్టాప్ కంప్యూటర్లలో విండోస్ 95ను ఇన్స్టాల్ చేసుకున్న వినియోగదారులకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఆటోమూటిక్గా డౌన్లోడ్ అయ్యేలా చేసింది. అప్పట్లో పోటీ ఏదీ లేకపోవడంతో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కు వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. 2003లో ఓ వెలుగు వెలిగింది ఈ బ్రౌజర్.
అప్పటివరకు 95 శాతం వినియోగదారులు దీని మీదే ఆధారపడ్డారు. కాలక్రమేణా తన ప్రాభవాన్ని కోల్పోయింది. గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఎంట్రీ ఇచ్చిన తరువాత పోటీ తీవ్రతరమైంది. దీన్ని తట్టుకోలేకపోయింది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మారుతున్న కాలానికి అనుగుణంగా దీన్ని అప్డేట్ చేయడానికి బదులుగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
2014 నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఎలాంటి అప్డేట్స్ ఉండట్లేదు. దాని వినియోగం పూర్తిగా తగ్గిపోవడంతో.. సేవలను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇవ్వాళ్టి నుంచి ఎక్స్ప్లోరర్ సేవలను నిలిపివేసింది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వినియోగానికి గుడ్బై చెప్పబోతున్నాని మైక్రోసాఫ్ట్ తెలిపింది.