మైక్రోసాఫ్ట్ అరుదైన ఘనత, 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్
ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన రెండో సంస్థగా ఈ అమెరికా కంపెనీ నిలిచింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో కంపెనీ షేర్ ధర 1.2 శాతం పెరగడంతో ఈ మార్కును దాటింది. రెండు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్కు సౌదీ దిగ్గజం సౌదీ ఆరామ్కో కొద్ది దూరంలో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 1.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారంలో మంచి పురోభివృద్ధి సాధించడంతో కంపెనీ వ్యాల్యూ కొద్దికాలంగా గణనీయంగా పెరిగింది.
ఆపిల్ తర్వాత మైక్రోసాఫ్ట్
2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ దాటిన మొదటి అమెరికా సంస్థ ఆపిల్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఈ మార్కును క్రాస్ చేసింది. ఈ కంపెనీలకు సౌదీ ఆరామ్కో కాస్త దగ్గరగా ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 1.77 ట్రిలియన్ డాలర్లతో ఉంది. ఈ సంస్థ కూడా 2 ట్రిలియన్ డాలర్లకు సమీపంలో ఉంది. మంగళవారం మైక్రోసాఫ్ట్ స్టాక్ 1.1 శాతం లాభపడింది. ఈ ఏడాది ఈ సంస్థ స్టాక్ 20 శాతానికి పైగా లాభపడింది.
క్లౌడ్ సేవలతో
మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. కరోనా సమయంలోను డిమాండ్కు తగిన విధంగా క్లౌడ్ సేవలు అందించింది. ఈ వ్యాపారం ద్వారా ఎక్కువగా ఆర్జించింది. ఇది త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించింది. మార్చి త్రైమాసికంలో 41.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది ప్రాతిపదికన ఇది 19 శాతం అధికం. 2019 నుండి ఇది అత్యుత్తమ రెవెన్యూ గ్రోత్. ప్రాఫిట్ 44 శాతం పెరిగి 15.5 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
అమెజాన్కు పోటీ
2014లో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేట్టినప్పటి నుండి సత్య నాదెళ్ల ఎన్నో మార్పులు చేశారు. క్లౌడ్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రస్తుతం కంపెనీ ప్రపంచంలో అత్యధికంగా క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్టువేర్ను విక్రయిస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇన్ఫ్రా, ఆఫీస్ అప్లికేషన్ల యూనిట్లను బాగా విస్తరించింది. అమెరికా యాంటీ ట్రస్ట్ నియంత్రణ సంస్థ నుండి సమస్యలు ఎదురుకాకుండా పని చేసుకుపోయింది. 2008-11 వరకు ఆయన క్లౌడ్ రంగంపై పట్టు సాధించారు. ఆయన పగ్గాలు చేపట్టాక విండ్ డివిజన్ను, క్లౌడ్ డివిజన్ (అజ్యూర్)ను వేరు చేశారు. బృందాల్లో మార్పులు చేశారు. దీంతో అమెజాన్ క్లౌడ్ వ్యాపారానికి బలమైన పోటీ ఇస్తోంది.