స్మార్ట్ఫోన్ల మార్కెట్లోకి మళ్ళీ మైక్రోమాక్స్.. రూ.500 కోట్ల పెట్టుబడి!
దేశీయ మొబైల్ ఫోన్ల మార్కెట్ కొంత కాలంగా చైనీస్ కంపెనీల ఆధిపత్యంలో నడుస్తోంది. ఎంఐ నుంచి ఒప్పో వరకు, వివో నుంచి వన్ ప్లస్ వరకు మన దేశంలో విక్రయమవుతున్న స్మార్ట్ ఫోన్ల లో 70% నికి పైగా ఈ కంపెనీలు విక్రయించేవే. అయితే ఇటీవల గాల్వాన్ లోయ లో జరిగిన పరిణామాల తర్వాత ఇండియా - చైనా ల మధ్య దౌత్య సంబంధాలతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యం కూడా దెబ్బతింటున్న విషయం తెలిసిందే. ఇటీవల చైనాకు చెందిన మొబైల్ ఆప్స్ ను నిషేధించిన అనంతరం ఇది మరింత అధికం ఐంది.
ఇండియా లో చైనా వస్తువులు, మొబైల్ ఆప్స్ అధిపత్యానికి చెక్ పెట్టె సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం ఇండియా లో తయారీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అదే సమయంలో ఇండియన్ కంపెనీల పెట్టుబడులకు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు మరింత ప్రోత్సాహమిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ దేశీయ కంపెనీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రభుత్వం అందించే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీ ఎల్ ఐ ) తో కంపెనీలు మరింత విశ్వాసంతో ముందుకు సాగుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ ఆసక్తి.. ముఖేష్ అంబానీ రిలయన్స్తో టిక్టాక్ చర్చలు
మైక్రోమాక్స్ 2.0 ...
గతంలో దేశీయ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఒక వెలుగు వెలిగిన మైక్రోమాక్స్ .... ప్రస్తుతం మళ్ళీ తన సత్తా చాటాలని చూస్తోంది. 2014 లో మైక్రోమాక్స్ దేశీయ మొబైల్స్ మార్కెట్లో ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. కానీ ఆ తర్వాత పరిణామాల తో దేశంలోకి చైనా మొబైల్ హ్యాండ్సెట్ కంపెనీల రంగ ప్రవేశం జరిగింది. ఇక అంతే మెల్లగా మన దేశ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ను పూర్తిగా తమ అధిపత్యంలోకి తీసుకున్నాయి. దేశంలో విక్రయమయ్యే ప్రతి నాలుగు స్మార్ట్ ఫోన్ల లో మూడు ఫోన్లు చైనా కంపెనీలవే కావటం గమనార్హం. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో మళ్ళీ ఈ రంగంలోకి ప్రవేశిస్తామని, పరిశోధన & అభివృద్ధి కోసం, దేశంలో తయారీ ని పటిష్టం చేయటం కోసం రూ 500 కోట్లు పెట్టుబడిగా పెడతామని మైక్రోమాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మ వెల్లడించారు.
ఆ స్కీం తో ప్రయోజనం...
ప్రభుత్వం ప్రకటించిన పీ ఎల్ ఐ స్కీం తో ఇండియా లో తయారీ కంపెనీలకు భారీ ప్రయోజనం కలుగుతుందని రాహుల్ శర్మ పేర్కొన్నారు. దీంతో 6% రాయితీ లభిస్తుందని, అప్పుడు చైనీస్ కంపెనీలతో పోటీ పడేందుకు ఇండియన్ కంపెనీలకు సరైన మద్దతు లభిస్తుందని చెప్పారు. కాబట్టి, తాము అంతర్గత వనరులతో కూడా తమ ప్రణాళికలు అమలు పరిచేందుకు సమాయత్తం అవుతున్నామని, అలాగే సరైన సమయంలో అవసరమైతే నిధుల సమీకరణ చేపడతామని పేర్కొన్నారు. దీంతో మైక్రోమాక్స్ మళ్ళీ ఇండియన్ స్మార్ట్ ఫోన్ల తయారీ లో ప్రవేశిస్తోందని స్పష్టం అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో కూడా వినియోగదారులు ఇండియన్ బ్రాండ్స్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇండియా లో డేటా స్టోరేజ్ వల్ల పూర్తిస్థాయిలో అనుకున్న ప్రయోజనం లభించక పోవచ్చని రాహుల్ అభిప్రాయపడ్డారు. అదే డేటా ను ఉపయోగించి ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా కూడా బాట్స్ కు శిక్షణ ఇవ్వవచ్చని తెలిపారు.
భారీ మార్కెట్...
ఇండియన్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మార్కెట్ల లో ఒకటిగా నిలుస్తోంది. 2019 లో ఇండియా లోకి సుమారు 152 మిలియన్ హ్యాండ్సెట్స్ దిగుమతి అయ్యాయి. మన దేశ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో షావోమి అగ్రస్థానంలో నిలుస్తోంది. సుమారు 39% మార్కెట్ వాటా తో దూసుకుపోతోంది. తర్వాతి స్థానంలో కూడా మరో చైనా కంపెనీ వివో నిలుస్తోంది. ఇది 21% నికి పైగా మార్కెట్ ను సొంతం చేసుకుంది. ఇక కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శ్యాంసన్గ్ మాత్రం కేవలం 16% మార్కెట్ వాటా తో మూడో స్థానంలో నిలుస్తోంది. వన్ ప్లస్, ఒప్పో వంటి బ్రాండ్స్ మిగితా మార్కెట్ షేర్ దక్కించుకున్నాయి. లగ్జరీ స్మార్ట్ ఫోన్ల లో మాత్రం ఆపిల్ తన సత్తా చాటుతోంది. కాబట్టి, విపరీతమైన పోటీ నెలకొన్న ఈ మార్కెట్ లోకి మళ్ళీ దేశేయ కంపెనీలు అడుగిడాలంటే వాటికి ప్రభుత్వ మద్దతు అత్యవసరం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.