ఉద్యోగులకు ఈ-కామర్స్ మీషో ఆఫర్, వర్క్ ఫ్రమ్ ఎనీ లొకేషన్
సాఫ్టుబ్యాంక్, ఫేస్బుక్ పెట్టుబడులు కలిగిన ఈ-కామర్స్ దిగ్గజం మీషో తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. కరోనా కారణంగా ఇప్పటికే ఐటీ రంగం మొదలు అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఒమిక్రాన్కు ముందు జనవరి నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రారంభించాలని పలు సంస్థలు భావించాయి. కానీ అంతలోనే ఒమిక్రాన్ ప్రభావం చూపింది. దీంతో ఐటీ సహా అన్ని రంగాల్లోని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగించాయి. అయితే తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం మీషో తమ ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది.
ఇంటి నుండి లేదా ఆఫీస్కు లేదంటే తమకు ఇష్టం వచ్చిన చోటు నుండి పని చేసేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పించింది. ఇది కొద్ది రోజుల కోసం ప్రకటించిన విధానం కాదని, ఉద్యోగులు శాశ్వతంగా తమ ఎంపిక మేరకు పని చేయవచ్చునని పేర్కొంది. బెంగళూరులో సంస్థకు హెడ్ ఆఫీస్ ఉంది. అయితే ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చిన చోటు నుండి పని చేయవచ్చు. ఉద్యోగుల డిమాండ్ ఆధారంగా, అధిక టాలెంట్ డెన్సిటీ ఉన్న ప్రదేశాల్లో శాటిలైట్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనుంది. అంటే దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల్లో కార్యాలయాలను తెరిచే ఉద్దేశ్యంలో ఉంది.
భవిష్యత్తు పని విధానాలకు సంబంధించి అనేక నమూనాలు తాము అధ్యయనం చేశామని, మీషోతో అంతర్జాతీయంగా ఉన్న ప్రతిభావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయని మీషో సీహెచ్ఆర్ఓ ఆశిష్ కుమార్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థలో 1700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందరికీ కొత్త విధానాన్ని అమలు చేస్తామని, మీషో హెడ్ ఆఫీస్కు అధికారిక ప్రయాణాల కోసం వచ్చే వర్కింగ్ పేరెంట్స్కు మద్దతుగా వారి ఆరేళ్లలోప పిల్ల కోసం మీషో డే-కేర్ సదుపాయాలు కూడా కల్పిస్తుంది.