Adani Group: హిండెన్బర్గ్ కు ఎదురుదెబ్బ.. అదానీకి అనుకూలంగా మారిషస్ ప్రకటన..
Adani Group: జనవరి చివర్లో అమెరికా సంస్థ హిండెన్బర్గ్ భారత బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీకి చెందిన వ్యాపారాలపై నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక భారత స్టాక్ మార్కెట్లలో కల్లోలాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ ఆరోపణల నేపథ్యంలో సెబీ వంటి సంస్థలు సైతం నిజనిజాలను బయటకు తీసుకొచ్చేందుకు దర్యాప్తు ప్రారంభించాయి. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఇన్వెస్టర్లలో ధైర్యాన్ని నింపేందుకు అదానీ గ్రూప్ చేయని ప్రయత్నాలు లేవు. అప్పులను ముందుగా చెల్లించటం నుంచి విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించటం వరకు అనేక ప్రణాళికలను అవలంబించింది.
అయితే ఈ క్రమంలో మారిషస్లో ఉన్న బూటకపు కంపెనీల నుంచి డబ్బును అదానీ గ్రూప్ రీరూట్(మనీలాండరింగ్ ) చేసిందంటూ అతిపెద్ద ఆరోపణలను సైతం చేసింది. ఆ కంపెనీలను వినియోగించుకుని షేర్ ధరలను ప్రభావితం చేసిందని అదానీపై హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే వీటికి తాజాగా గట్టి సమాదానం దొరికిందని చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలో మారిషస్ ఆర్థిక సేవల మంత్రి మహేన్ కుమార్ సీరుత్తున్ దేశ పార్లమెంట్లో కీలక కామెంట్స్ చేశారు. ఇవి అదానీ గ్రూప్కు ఊతమిచ్చేందుకు దోహదపడ్డాయి. తమ దేశంలో షేల్ కంపెనీలు ఉన్నాయంటూ అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిందని మంత్రి వెల్లడించారు. మారిషస్ OECDకి కట్టుబడి ఉందని చెప్పారు. ఒక పార్లమెంటు సభ్యుడు లిఖితపూర్వక నోటీసుకు మంత్రి ఇలా బదులిచ్చారు.
చట్టం ప్రకారం షెల్ కంపెనీలకు మారిషస్లో అనుమతి లేదని మారిషస్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు ఎలాంటి ఉల్లంఘనలు కనుగొనలేదని మంత్రి వెల్లడించారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ హిండెన్బర్గ్ నివేదికను పరిగణనలోకి తీసుకుందని, అయితే రెగ్యులేటర్ చట్టం గోప్యత నిబంధనకు కట్టుబడి ఉందని అందువల్ల వివరాలను వెల్లడించలేమని ఆయన అన్నారు. మెుత్తానికి తమ దేశంలో ఎలాంటి షెల్ కంపెనీలు లేవని పార్లమెంట్ సాక్షిగా మారిషస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు అదానీ గ్రూప్ కు పెద్ద ఊరటను అందిస్తున్నాయి.