Market bloodbath: యస్ బ్యాంక్, చమురు, కరోనా... మార్కెట్లు కుప్పకూలడానికి ముఖ్య కారణాలు
ముంబై: కరోనా వైరస్ కారణంగా సోమవారం మార్కెట్లు కనీవినీ ఎరగని నష్టాలు చవిచూశాయి! ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అన్ని వ్యాపారాలు పడిపోయాయి. ఈ ప్రభావం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. దీనికి రష్యా, సౌదీ అరేబియా చమురు యుద్ధం మరింత ఆజ్యం పోసింది. మొత్తానికి భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా కుప్పకూలాయి.
కరోనా వైరస్ దెబ్బ, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బ్లాక్ మండే... ప్రపంచ మార్కెట్లలోనూ..
ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు.. ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ 1,941.67 (5.17%) పాయింట్ల నష్టంతో 35,634.95 వద్ద, నిఫ్టీ 538.00 (4.90%) పాయింట్ల నష్టంతో 10,451.45 వద్ద క్లోజ్ అయింది. ఓ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 2,400 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్లు నష్టపోయింది. దేశీయ మార్కెట్లకు ఇది బ్లాక్ మండేగా నిలిచింది. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు. ప్రపంచ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. భారత స్టాక్ మార్కెట్ల నష్టానికి కారణాలు...
రష్యాతో సౌదీ చమురు ధరల యుద్ధం
రష్యాతో సౌదీ అరేబియా చమురు ధరల యుద్ధానికి దిగింది. ధరలను తగ్గిస్తోంది. అదే సమయంలో త్వరలో ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలని నిర్ణయించింది. సౌదీ-రష్యా మధ్య అవగాహన దెబ్బతిని ధరల యుద్ధానికి దారి తీయడంతో మార్కెట్లపై ప్రభావం పడింది. రష్యా-ఒపెక్ దేశాల మధ్య పోటీ కారణంగా క్రూడాయిల్ ధరలు ఏకంగా 30 శాతం వరకు తగ్గాయి.
భారత్కు లాభమే కానీ...
సౌదీ అరేబియా - రష్యా చమురు ధరల పోరు భారత్కు ప్రయోజనమే. కానీ మార్కెట్లపై ఈ ప్రభావం కూడా పడింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్పై భారీగా ప్రభావం పడింది. చమురు రంగంలోని రిలయన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీల షేర్లు 15 శాతం వరకు పడిపోయాయి. రిలయన్స్ షేర్లు పతనం కావడంతో మార్కెట్ క్యాప్ పరంగా టీసీఎస్ ముందుకు దూసుకు వచ్చింది.
కరోనా దెబ్బ
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది వందకు పైగా దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ దేశాల వాణిజ్యంపై ప్రభావం పడుతోంది. ఒక్క ఇటలీలోనే 16 మిలియన్ల మంది ఐజోలేషన్లో ఉన్నారు. చైనాలో అయితే 50 కోట్ల మంది వరకు ఉన్నారు. బాధితుల సంఖ్య లక్ష దాటింది. మతుల సంఖ్య మూడున్నర వేలకు చేరువైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 2.4 ట్రిలియన్ టన్నుల మేర నష్టపోతుందని అంచనా. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే 211 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ పేర్కొంది.
యస్ బ్యాంకు..
యస్ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సంస్థ కేవలం కార్పోరేట్ రుణ వ్యాపారం చేసి దెబ్బతినడంతో దేశీయ కార్పోరేట్ రంగంపై సందేహాలు ముసురుకున్నాయి. యస్ బ్యాంక్ బాండ్లను రేటింగ్ సంస్థలు డౌన్ గ్రేడ్ చేశాయి. ఈ సంస్థకు రూ.56,612 కోట్ల విలువైన బాండ్స్ ఉన్నాయి. ఇప్పటికే బేసిల్ 2టైర్1 బాండ్స్కు కూపన్ పేమెంట్ చెల్లించలేదు. భవిష్యత్తులో డీఫాల్టర్గా మారితే ఇక కష్టమేనని ఆందోళనలు ఉన్నాయి.
FPI
గత పదిహేను సెషన్లుగా FPIలు వరుసగా అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దాదాపు రూ.21,937 కోట్లను వీరు ఈక్విటి మార్కెట్ నుండి ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి FPI కౌంటర్లలో సెల్లింగ్ కొనసాగుతోంది. ఈ ఫలితం రూపాయి మీద కూడా ప్రభావం చూపింది. డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి వ్యాల్యూ తగ్గుతోంది.