మార్చిలో 3 ఏళ్ల గరిష్టానికి పెట్రోల్, డీజిల్ వినియోగం, ఎందుకంటే?
మార్చి 2022లో చమురు భారత చమురు వినియోగం మూడేళ్ల గరిష్టానికి పెరిగింది. నాలుగున్నర నెలల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవలె పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగినప్పటికీ, రష్యా నుండి డిస్కౌంట్కు కొనుగోలు వంటి వివిధ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినంతగా మన దేశంలో ధరలు పెరగలేదు. ధరల పెరుగుదల ప్రారంభమైన మార్చి నెలలోనే చమురు వినియోగం కూడా అదేస్థాయిలో పెరిగింది.
గత మూడేళ్లలోనే పెట్రోల్, డీజిల్ వినియోగం 4.2 శాతం పెరిగి, కరోనా ముందుస్థాయిని దాటింది. దేశంలో కేవలం ఒక్క మార్చి నెలలోనే 19.41 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం నమోదయింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన ప్లానింగ్ అండ్ అనాలసిస్ ప్రకారం 2019 మార్చి నుండి ఇది గరిష్టం. ఆర్థిక రికవరీ నేపథ్యంలో వినియోగం పెరిగింది.
కరోనా థర్డ్ వేవ్ అనంతరం ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని, దీంతో చమురు వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిల్ వినియోగం గణనీయంగా పెరిగింది. కేవలం ఒక్క నెలలోనే 6.7 శాతం పెరుగుదలతో 7.7 మిలియన్ టన్నుల విక్రయాలు నమోదయ్యాయి. పెట్రోల్, డీజిల్ విక్రయాలు కరోనా ముందుస్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం పెరిగింది. దీనికి తోడు ధరల పెరుగుదల భయంతో పెట్రోల్ బంకుల్లో ముందస్తు నిల్వలు చేసుకోవడం కూడా ఇందుకు దోహదపడింది. ఇక మార్చి నెలలో ఎల్పీజీ డిమాండ్ 9.8 శాతం పెరిగి 2.48 మిలియన్ టన్నులకు చేరింది.