ప్లాంట్ల మూసివేత: భారత్ ఆటోకు కరోనా భయం, BS-6 పొడిగింపు ఉంటుందా?
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రభావం చూపుతూ, చైనా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న కరోనా వైరస్.. భారత ఆటో రంగంలోను గుబులు పెంచింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా చైనా నుంచి వాహన విడిభాగాల సరఫరాకు ఆటంకం ఏర్పడవచ్చునని ఇండస్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు. చైనా కొత్త ఏడాది తర్వాత ప్లాంట్లలో ఉత్పత్తి అంతంతమాత్రమేనని అంటున్నారు. అక్కడి ప్లాంట్లలో ఉత్పత్తి పునఃప్రారంభమయ్యాక సరఫరాపై పూర్తి స్పష్టత వస్తుందని సియామ్ పేర్కొంది.
భారత ఫార్మాలకు కరోనా వైరస్ దెబ్బ, గ్లోబల్ ఎకానమీపై ప్రభావం
భారత ఆటోపై కరోనా వైరస్ ప్రభావం..
చైనా నుంచి విడిభాగాల సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందా, దేశీయంగా వాహన తయారీ, BS6 పరివర్తనంపై ఏమేర ప్రభావం పడుతుంది తదితర అంశాలపై సియామ్ సభ్య కంపెనీల నుండి డేటా సేకరిస్తోంది. దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఆటో ఎక్స్పోపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. వివిధ చైనా కంపెనీల ప్రతినిధులు హాజరుకాలేదు.
చైనా నుంచి రాని ప్రతినిధులు
భారత్లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించిన చైనాలోని అతిపెద్ద SUV తయారీదారు గ్రేట్ వాల్ మోటార్స్కు చెందిన ప్రతినిధులు ఆటో ఎక్స్పోకు హాజరు కాలేదు. భారత్లోని తమ కంపెనీల ప్రతినిధుల సాయంతో ఆటోషోలో వాహనాలు ప్రదర్శించారు. హైమా బ్రాండ్నేమ్తో వాహనాలు విక్రయిస్తున్న ఎఫ్ఏడబ్ల్యు గ్రూప్ భారత పర్యటనను రద్దు చేసుకుంది.
ప్లాంట్లను మూసివేసిన ఉత్పాదక, విడిభాగాల కంపెనీలు
ప్రస్తుతం చైనా కరోనాను అదుపులో పెట్టడం పైనే దృష్టి సారించింది. దీంతో ఉత్పత్తి పడిపోయింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా చైనాలోని పారిశ్రామిక సంస్థలు తయారీ కేంద్రాలను మూసివేస్తున్నాయి. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. ఉత్పాదక సంస్థలు మాత్రం సెలవులు ప్రకటించాయి. ఆటో సంస్థలు ప్లాంటును మూసివేశాయి. ఆటో విడిభాగాల తయారీ సంస్థలదీ అదే దారి.
BS6కు మార్పు... విడిభాగాల కొరత ఉంటుందా?
BS4 నుంచి BS6కు మారుతున్న భారత వాహన రంగాన్ని కరోనా వైరస్ దెబ్బతీస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి BS6 వాహన అమ్మకాలు మాత్రమే ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన విడిభాగాలు చైనా నుంచే పెద్ద మొత్తంలో భారత్కు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా కారణంగా చైనాలో మూతబడుతున్న పరిశ్రమలు.. భారత విడిభాగాల అవసరాల కొరతకు దారితీస్తుందని ఆటో ఇండస్ట్రీని ఆందోళన చెందుతుంది.
BS6 ప్రమాణాల గడువు పొడిగిస్తారా?
కరోనా వైరస్ ప్రభావం, ఉత్పాదక రంగంపై ప్రభావం ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి BS6 ప్రమాణాల గడువును పొడిగిస్తారా అనే చర్చ సాగుతోంది. ఈ అంశంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని సియామ్ అంటోంది. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. సభ్య కంపెనీలతో సంప్రదింపులు జరిపి, డేటా వచ్చాక మాట్లాడుతామని పేర్కొంది.