Twitter: ఉద్యోగుల రాజీనామాలు.. బంద్ అయిన ట్విట్టర్ కార్యాలయాలు.. ఏం జరుగుతోంది..?
Twitter: ప్రపంచంలోని క్రేజీ వ్యాపారవేత్త ఎవరంటే ఎలాన్ మస్క్ అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆయన నిర్ణయాలతో పాటు ఆలోచనలు సైతం అలాగే ఉంటాయి. తాజాగా ఈ కుబేరుడు ఉద్యోగులకు పంపిన ఘాటు ఈ-మెయిల్ ప్రకంపనలే సృష్టిస్తోంది. అయితే మస్క్ ట్విట్టర్ విషయంలో చేస్తున్న మార్పులు మంచికేనా లేక కంపెనీని ముంచేందుకో నిపుణులకు కూడా అర్థం కావటం లేదు.
చచ్చిపోయిన ఉత్సాహం..
బిలియనీర్ ఉద్యోగులను తొలగించటం, ఎక్కువ గంటలు పనిచేయాలనటం, తప్పక ఆఫీసులకు రమ్మనటంతో పాటు ఆయన ఇస్తున్న టార్గెట్లు ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీంతో చాలా మంది నువ్వొద్దు నీ ఉద్యోగం మాకు అస్సలు వద్దంటూ ట్విట్టర్ ను వీడుతున్నారు. ఒకరు తర్వాత మరొకరు సీనియర్లు కంపెనీని నిష్క్రమిస్తుండగా.. ఇప్పుడు మిగిలిన ఉద్యోగులు సైతం తమలో పనిచేయాలనే ఉత్సాహం చచ్చిపోయిందంటూ కంపెనీని వీడుతున్నారు.
రాయిటర్స్ నివేదిక..
ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం ట్విట్టర్ లో దాదాపు 100 మంది ఉద్యోగులు కంపెనీని వీడేందుకు సిద్ధింగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 42 శాతం ఉద్యోగులు కంపెనీని వీడాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఈ సర్వేలో మెుత్తం 180 మంది ఉద్యోగులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కార్యాలయాల మూసివేత..
కొద్ది రోజుల కిందట మస్క్ కంపెనీ నిబంధనలు పాటించని ఉద్యోగులు 3 నెలల జీతంతో వెళ్లిపోవచ్చంటూ రెండు రోజుల్లో బదులివ్వాలన్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక చోట్ల ట్విట్టర్ కార్యాలయాలు తాక్కాలికంగా మూసివేయబడ్డాయి. ఉద్యోగులకు జారీచేసిన యాక్సిస్ కార్డులు సైతం పనిచేయటం లేదని సమాచారం. ఇది కంపెనీ భవిష్యత్తుపై అనేక అనుమానాలను కలిగిస్తోంది. నవంబర్ 21 వరకు కార్యాలయ భవనాలు మూసివేయబడతాయి.
సమాచారం ఇవ్వకుండానే..
ఆఫీసుల మూసివేతపై ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కంపెనీ వాటిని క్లోజ్ చేసింది. అయితే ఇది ఉద్యోగుల రాజీనామాలను అడ్డుకునేందుకా లేక కొత్త వ్యవస్థలను ప్రారంభించేందుకా అనే వివరాలు తెలియక ఉద్యోగుల్లో ఇప్పటికే గుబులు మెుదలైంది. అసలు ప్రశాంతంగా ఉన్న ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేసి ఎలాన్ మస్క్ దాని భవిష్యత్తును నాశం చేస్తున్నారా అనే అనుమానాలు చాలా మందిలో నెలకొన్నాయి.