Bumper IPO: తొలిరోజు ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు.. మ్యాన్ కైండ్ కాసుల మ్యాజిక్..
Bumper IPO: చాలా కాలంగా మార్కెట్లలో మంచి ఐపీవో కోసం ఎదురుచూసిన ఇన్వెస్టర్లకు మంచి కాలం వచ్చిందనిపిస్తోంది. ప్రఖ్యాత దేశీయ ఫార్మా సంస్థ మ్యాన్ కైండ్ ఐపీవో నేడు స్టాక్ మార్కెట్లలోకి అడుగు పెట్టింది.
మ్యాన్ కైండ్ ఫార్మా ఐపీవోలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు మంచి రాబడులను పొందారు. ఈ స్టాక్ బీఎస్ఈలో రూ.1300 వద్ద లిస్ట్ అయ్యింది. అంటే షేర్లు మార్కెట్లో దాదాపు 20 శాతం ప్రీమియం ధరకు ట్రేడింగ్ ప్రారంభించాయి. మధ్యాహ్నం 11.25 గంటల సమయంలో స్టాక్ ధర రూ.1,375 వద్ద ఉంది. అలాగే ఇంట్రాడేలో గరిష్ఠ ధర రూ.1,414ను తాకింది.
ఐపీవో ప్రైస్ బ్యాంక్ గమనిస్తే ఒక్కో షేరు ధర రూ.1026 నుంచి రూ.1080గా ఉంది. నిన్న సాయంత్రం గ్రే మార్కెట్లో స్టాక్ ప్రీమియం రూ.120గా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఒక్కో షేరుపై ఐపీవోలో స్టాక్స్ పొందిన ఇన్వెస్టర్లు రూ.295 లాభం పొందారు. దీనికి ముందు 2020లో గ్లాండ్ ఫార్మా కంపెనీ రూ.6,480 కోట్ల ఐపీవో ఫ్లోట్ చేయగా.. ఆ తర్వాత ఫార్మా రంగంలో వస్తున్న అతిపెద్ద ఐపీవోగా మ్యామ్ కైండ్ నిలిచింది.
ప్రధానంగా అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారుల నుండి బలమైన ప్రతిస్పందన లభించటంతో ఐపీవో విజయవంతం అయ్యింది. దాదాపు 50 రెట్లు అధికంగా బిడ్డింగ్ జరిగింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.4326 కోట్లను సమీకరించింది. ఈ ఐపీవోలో CPPIB, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, గోల్డ్మన్ సాచ్స్, ఫిడిలిటీ, బ్లాక్రాక్, GIS, నోమురా వంటి 16 మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ ఫార్మా ఐపీవోలో ఆసక్తిని కనబరిచాయి.