COVID 19: హైదరాబాద్లో మహీంద్రా ఉచిత క్యాబ్స్, ఫ్రీ బైక్ సర్వీసింగ్ పొడిగింపు
కరోనా మహమ్మారిపై పోరుకు కార్పోరేట్ దిగ్గజాలు పీఎం కేర్స్ ఫండ్కు పెద్ద మొత్తంలో నిధులు అందిస్తున్నాయి. అంతేకాదు, తమకు సాధ్యమైన మేరకు వెంటిలెటర్స్ తయారీ, మాస్కుల పంపిణీ, మెడికల్, ఎమర్జెన్సీ సేవల కోసం అవసరమైతే తమ వాహనాలు అందించడం, రిలయన్స్ వంటి సంస్థ కరోనా ఆసుపత్రి నిర్మాణం.. ఇలా వివిధ రూపాల్లో సహకరిస్తున్నాయి. ఇందులో భాగంగా మహీంద్రా లాజిస్టిక్స్ ఉచిత క్యాబ్ సేవలు ప్రారంభించింది.
ఐటీ కంపెనీల గుడ్న్యూస్: డోంట్ వర్రీ.. ఆఫర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే!
హైదరాబాద్లో మహీంద్ర క్యాబ్స్
మహీంద్ర లాజిస్టిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో కరోనా పేషెంట్ల కోసం ఉచిత అత్యవసర క్యాబ్ సేవల్ని ప్రారంభించింది. రాచకొండ కమిషనరేట్ సహకారంతో హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, రాచకొండ కమిషనరేట్ పరిధిల్లో ఈ సర్వీసుల్ని మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ క్యాబ్స్ 24 గంటలు నడుస్తాయని సంస్థ ఎండీ, సీఈవో రాంప్రవీణ్ స్వామినాథన్ వెల్లడించారు.
హీరో మోటో కార్ప్ పొడిగింపు
మార్చి 21 నుండి ఏప్రిల్ 30వ తేదీ మధ్య గడువు ముగిసే ఉచిత సర్వీస్ను 2020 జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు హీరో మోటో కార్ప్ తెలిపింది. లాక్ డౌన్ సమయం ముగిసే వారంటీ గడువును కూడా జూన్ 30వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
పీఎం కేర్స్ ఫండ్కు నిధులు
ఇదిలా ఉండగా, పీఎం కేర్స్ ఫండ్కు డాబుర్ ఇండియా రూ.11 కోట్లు అందించింది. రూ.10 కోట్లతో దేశవ్యాప్తంగా పోలీసులకు ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, అత్యవసర మెడిసిన్స్ అందించేందుకు, వలస కార్మికులకు రోజుకు 2500 మందికి భోజనానికి వినియోగిస్తామని తెలిపింది.
జేఎం ఫైనాన్షియల్ రూ.15 కోట్లు పీఎం కేర్స్ ఫండ్కు అందిస్తానని తెలిపింది. మరో రూ.15 కోట్లతో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపింది.
కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అత్యవసర సేవల సిబ్బంది రక్షణ కోసం ఫేస్ షీల్డులను తమ చెన్నై, సనంద్ ప్లాంట్స్లలో తయారు చేస్తామని ఫోర్డ్ ఇండియా ప్రకటించింది.
HDFC బ్యాంకు ద్వారా విరాళాలు ఇవ్వొచ్చు
కరోనా కట్టడికి ఆర్థిక సాయం చేయానుకునే వారి కోసం పీఎమ్ కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ నిధి కోసం విరాళాలు సేకరించేందుకు తమకు అనుమతి లభించిందని HDFC బ్యాంక్ పేర్కొంది. పీఎమ్ కేర్స్ నిధికి విరాళం ఇవ్వాలనుకున్నవారు తమ బ్యాంకు వెబ్సైట్ ద్వారా డొనేషన్లు ఇవ్వవచ్చునని తెలిపింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐల ద్వారా విరాళాలు చెల్లించేందుకు సంస్థ వెబ్సైట్లో అవకాశముందని తెలిపింది.