LPG Cylinder price: పెట్రోల్, డీజిల్తో పాటు గ్యాస్ సిలిండర్ షాక్, ఎంత పెరిగిందంటే?
ఇప్పటికే దాదాపు ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పలురాష్ట్రాల్లో ఇంధన ధరలు రూ.100 దాటాయి. రాజస్థాన్ శ్రీగంగాపూరంలో అయితే లీటర్ పెట్రోల్ రూ.110 క్రాస్ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక సహా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ సెంచరీ దాటింది. ఇప్పటికే పెట్రో మంట ఉండగా, నేటి(జూలై 1) నుండి వంట గ్యాస్ ధర కూడా పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25 వరకు పెరిగింది.
ఢిల్లీలో ధర ఎంత ఉందంటే
చమురురంగ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎల్పీజీ ధరలను సవరిస్తాయి. తాజా సవరణలో భాగంగా నేడు ధరలను పెంచాయి. దేశీయంగా సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.25 పెంచాయి. దీంతో 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రూ.834.50గా ఉంది.
కమర్షియల్ సిలిండర్ ధరను రూ.76 పెంచాయి. సవరించిన రేట్లు నేటి నుండి (జూలై 1వ తేదీ) అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గత ఏడాది నవంబర్ నుండి పెరుగుతున్నాయి.
వివిధ నగరాల్లో ధరలు
ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కిలోలు) సిలిండర్ ధర రూ.834.50, కమర్షియల్ సిలిండర్ ధర రూ.1550గా ఉంది. ముంబైలో డొమెస్టిక్ కుకింగ్ గ్యాస్ ధర రూ.834.50, కోల్కతాలో రూ.835.50, చెన్నైలో రూ.850.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.84 వరకు పెరిగింది.
ఆరు నెలల కాలంలో రూ.140 జంప్
14.2 ఎల్పీజీ సిలిండర్ ధర గత ఆరు నెలల కాలంలో రూ.140 వరకు పెరిగింది. ఎల్పీజీ ధర మార్కెట్ రేటు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అయితే కొంతమంది కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ ఏడాది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మొదటిసారి ఫిబ్రవరి 4న రూ.25 పెరిగింది. ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25న రూ.25, ఏప్రిల్ 1న రూ.125 పెరిగింది.