వామ్మో.. గ్యాస్ ధర రూ.1800, లీటర్ పెట్రోల్ రూ.170.. ఆకాశానికి ధరలు..!
LPG Rates: ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు పెరిగిన ధరల భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో మనదేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రం నిత్యావసరాలు, ఇంధన ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఉప్పు, పప్పు, బియ్యం నుంచి కూరగాయలు, పెట్రోల్, వంట గ్యాస్ వరకు అన్నింటి ధరలు ఇతర రాష్ట్రాల్లో కంటే మణిపూర్ లో విపరీతంగా పెరిగాయి. గడచిన మూడు వారాలుగా అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ రాష్ట్రంలో జరిగిన హింస, అల్లర్ల కారణంగా బయటి ప్రాంతాల నుంచి వస్తువుల రవాణా ప్రభావితం కావటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అనేక వస్తువులు సాధారణ ధరల కంటే రెట్టింపు రేట్లకు విక్రయిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ రేట్లకు వస్తువులు దొరుకుతున్నాయి. గతంలో 50 కిలోల సూపర్ఫైన్ బియ్యం బస్తా రూ.900 ఉండగా.. ఇప్పుడు రూ.1800కి చేరింది. బంగాళాదుంపలు, ఉల్లిపాయల ధరలు కూడా రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు రూ.1,800కు విక్రయిస్తుండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.170కు చేరుకుంది. ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.10కి చేరుకుంది.
భద్రతా దళాలు రంగంలోకి దిగకమునుపు నిత్యావసరాల ధరలు మరింత ఎక్కువగా ఉండేవని స్థానికులు వెల్లడించారు. రవాణా వ్యవస్థలు దెబ్బతినటంతో ఈ పరిస్థితి ఎదురైంది. NH 37లో ట్రక్కుల కదలిక మే 15న ప్రారంభమైందని ఒక రక్షణ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి సుమారు 10,000 మంది సైన్యం, పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు.