ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది, 15 రోజుల్లో రెండోసారి
న్యూఢిల్లీ: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. 5 కిలోల షార్ట్ సిలిండర్ ధర రూ.18, 19 కిలోల సిలిండర్ ధర రూ.36.50 పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694, కోల్కతాలో రూ.720.50, ముంబైలో రూ.694, చెన్నైలో రూ.660కి పెరిగాయి. పెరగడానికి ముందు ఢిల్లీలో రూ.594, కోల్కతాలో రూ.620.50, ముంబైలో రూ.594, చెన్నైలో రూ.610గా ఉంది. ఇప్పుడు రూ.50 చొప్పున పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడల్లో వరుసగా రూ.696.50, రూ.854గా ఉంది.
అణిచివేత: ఫేస్బుక్కు అమెరికా, 48 రాష్ట్రాలు భారీ షాక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం అమ్మేస్తుందా?
రూ.100 పెరిగిన గ్యాస్
ప్రభుత్వరంగ కంపెనీలు ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. అయితే ఇప్పుడు పదిహేను రోజుల్లో వ్యవధిలోనే సిలిండర్ ధర రెండోసారి పెరిగింది. డిసెంబర్ 2వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. తాజాగా, మంగళవారం మరో రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఉత్తర్వు తెలిపింది. ఈ పదిహేను రోజుల్లో రూ.100 పెరిగింది.
కమర్షియల్ సిలిండర్ ధర
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.54.50 పెరిగి ఢిల్లీలో రూ.1,296గా ఉంది. ప్రభుత్వం ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీపై అందిస్తుంది. కొనుగోలు సమయంలో పూర్తిగా మార్కెట్ ధరలకు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం వినియోగదారుడి అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది. అయితే ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీపై అందుతాయి. అంతకు మించితే మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాలి. అంతర్జాతీయ ఎల్పీజీ ధరల్లో మార్పులు, విదేశీ మారకపు రేటు ఆధారంగా ప్రతి నెల ధరల్లో మార్పులు ఉంటాయి.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర
ప్రభుత్వరంగ చమురు కంపెనీలు IOC, BPCL, HPCL ఇతర వంట గ్యాస్ సిలిండర్ల పైనా కూడా పెంపును ప్రకటించాయి. 5 కిలోల సిలిండర్పై తాజాగా రూ.18 పెంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పైన రూ.36.5 పెంచాయి. కమర్షియల్ సిలిండర్ ధర కూడా ఈ పదిహేను రోజుల్లో దాదాపు రూ.100 పెరిగింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి.