LPG cylinder price: అక్టోబర్ తర్వాత... రూ.50 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెంచిన చమురురంగ సంస్థలు గ్యాస్ ధరలను కూడా పెంచాయి. 14 కేజీ వంటగ్యాస్ సిలిండర్ పైన ధరను రూ.50 పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ముగింపు, ఉక్రెయిన్లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చమురు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు మంగళవారం నుండి పెరిగాయి. ఢిల్లీ, ముంబై, ఇతర నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరలు రూ.50కి పైగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ తర్వాత దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం సామాన్యుడికి భారమే. ఢిల్లీ, ముంబైలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.949.50కి పెరిగింది. కోల్కతాలో సిలిండర్ ధర రూ.976కు పెరిగింది. చెన్నైలో రూ.965.50కి, లక్నోలో రూ.987.50కి పెరిగింది. పాట్నాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1039.50గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు కూడా నేడు పెరిగిన విషయం తెలిసిందే. లీటర్ పెట్రోల్, డీజిల్ పైన 137 రోజుల తర్వాత 80 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.21, డీజిల్ ధర రూ.87.47గా ఉంది. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.952కు పెరిగింది. అక్టోబర్ 2021 తర్వాత మొదటిసారి సిలిండర్ ధర రూ.50 పెరిగింది.


Click it and Unblock the Notifications