మారటోరియం పొడిగింపు కుదరదు: ఆర్బీఐ, మరిన్ని రాయితీలు సాధ్యం కాదు: కేంద్రం
కరోనా వైరస్ నేపథ్యంలో రుణాలపై మరింత కాలం వెసులుబాటు ఇవ్వలేమని, మారటోరియాన్ని ఇప్పటికే ఆరు నెలలు అందించామని, దీనిని పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లితుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సుప్రీం కోర్టుకు తెలిపింది. బ్యాంకు రుణాలపై గరీబ్ కళ్యాణ్, ఆత్మనిర్భర్ పేరుతో ఉపశమనం కల్పించామని, మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ మాఫీ మాత్రం ఇస్తామని, పొడిగింపు వంటి ఇతర వెసులుబాటు కల్పించలేమని స్పష్టం చేసింది. మారటోరియంను మరింతకాలం పొడిగించడం కుదరదన్నారు.
ఇన్ఫోసిస్ చేతికి అమెరికా డేటా అనలిటిక్స్ కంపెనీ, రూ.915 కోట్ల డీల్..
అందుకే 6 నెలలు మారటోరియం
కరోనా విపత్కర పరిస్థితుల్లో వివిధ రంగాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో రుణాల చెల్లింపులపై ఆరు నెలలు మారటోరియం ఇచ్చామని సుప్రీంకోర్టుకు సమర్పించినతన తాజా అఫిడవిట్లో ఆర్బీఐ పేర్కొంది. ఆరు నెలలకు మించి పొడిగింపు ఇస్తే రుణ క్రమశిక్షణను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీర్ఘకాలం వాయిదా వేయలేమని తెలిపింది. దీంతో ఆర్థిక వ్యవస్థలో రుణలభ్యత ఇబ్బందికరంగా మారుతుందని, బ్యాంకులకు నష్టాలు వస్తాయని తెలిపింది.
ఆ స్టే ఎత్తివేయాలి
అదే సమయంలో కరోనా సమయంలో చెల్లించని రుణాలను మొండి బకాయిల కింద పరిగణించకూడదని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ స్టే ఉత్తర్వులు వెంటనే ఎత్తివేయాలని, లేదంటే బ్యాంకింగ్ రంగం పైనే తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్బీఐ తెలిపింది.
మరిన్ని రాయితీలు ఇవ్వలేం
కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఆర్థిక శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంకా రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది. ఇప్పటికే రూ.22 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని తెలిపింది. ఎంఎస్ఎంఈలు సహా అన్ని రంగాలకు ప్యాకేజీ ప్రకటించామని పేర్కొంది. ఆర్థిక పాలసీలో కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిపింది. లోన్ మారటోరియం సమయానికి గాను రూ.2 కోట్ల లోపు రుణాలపై వడ్డీ పై వడ్డీని మాఫీ చేస్తున్నట్లు కేంద్రం కూడా సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆర్బీఐ, కేంద్రం అఫిడవిట్ నేపథ్యంలో తదుపరి విచారణ 13వ తేదీన జరగనుంది.