మారటోరియంపై మరో 2ఏళ్ల గడువు! వడ్డీ మాఫీచేస్తే వారికి అన్యాయం చేసినట్లే
ఢిల్లీ: కరోనా నేపథ్యంలో లోన్ మారటోరియం మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు రెండు రోజుల క్రితం స్ఫష్టం చేసింది. అయితే ఈఎంఐలపై వడ్డీ రద్దు చేయలేమని, ఇది ప్రాథమిక ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. వడ్డీని రద్దు చేస్తే మారటోరియం సమయంలో సకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి అన్యాయం చేసిన వారమవుతామని కోర్టులో అఫిడవిడ్ దాఖలు చేసింది.
గుడ్న్యూస్, లోన్ మారటోరియం రెండేళ్ల వరకు పొడిగించవచ్చు!
చెల్లించలేని వారికి ఈ అవకాశం
సెప్టెంబర్ 1వ తేదీ నాటికి కూడా రుణాలు చెల్లించలేమని ఎవరైనా చెబితే వారిని ఎన్పీఏలుగా ప్రకటించి, రెండేళ్ల మారటోరియం అవకాశాన్ని కల్పిస్తూ ఇప్పటికే ఆగస్ట్ 6వ తేదీన ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపింది. అలాంటి వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చునని కోర్టుకు తెలిపింది. మారటోరియం కాలంలో వడ్డీపై సమీక్షించాలని సుప్రీం కోర్టు సూచించడంతో మంగళవారం ఆర్థికమంత్రిత్వ శాఖ.. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనానికి అఫిడవిట్ సమర్పించింది.
వడ్డీని మాఫీ చేస్తే అన్యాయం చేసినట్లు..
మారటోరియంతో రుణగ్రహీతలకు లాభాలు ఉన్నాయని, ఖర్చులూ ఉన్నాయని ఈ అఫిడవిట్లో తెలిపింది. రెండింటినీ బేరీజు వేసుకొని రుణగ్రహీతలు ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఇప్పుడు వడ్డీ మాఫీ చేస్తే క్రమంగా తప్పకుండా చెల్లిస్తున్న వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని తెలిపింది. వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకు డిపాజిటర్లు కూడా ఇబ్బందులు పడతారని పేర్కొంది. ఎవరైనా వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఉంటే ఆ మొత్తానికి తాజాగా రుణం కూడా తీసుకోవచ్చునని తెలిపింది.
దెబ్బ మీద దెబ్బ
బ్యాంకులు రుణాలను పునర్వ్యవస్థీకరించవచ్చునని, కానీ కరోనా సంక్షోభం నేపథ్యంలో విధించిన మారటోరియంతో వాయిదాపడిన ఈఎంఐలపై వడ్డీతో పాటు చక్రవడ్డీ విధించడం, నిజాయితీగా రుణ బకాయిలను చెల్లిస్తున్న వారిని శిక్షించడం సరికాదని అంతకుముందు గజేంద్రశర్మ అనే పిటిషనర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. మారటోరియంతో ఉపశమనం పొందాలనుకున్న రుణగ్రహీతలకు చక్రవడ్డీ విధించడమంటే దెబ్బ మీద దెబ్బ కొట్టడమే అన్నారు. కష్టకాలంలో ఈఎంఐలపై జరిమానా విధించడాన్ని తప్పుబట్టారు.
మారటోరియంపై ఎంఫిన్ సూచన..
కరోనా మహమ్మారి నేపథ్యంలో రుణగ్రహీతలపై ఒత్తిడి కూడదని సూక్ష్మ రుణ సంస్థల సంఘం మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్ వర్క్ (ఎంఫిన్) కోరింది. రుణ మారటోరియం వ్యవధి ముగిసిన నేపథ్యంలో వ్యవహరించాల్సిన విధానాలను సూచిస్తూ తన సభ్యులకు కొన్ని సూచనలు జారీ చేసింది. ఆదాయాలు తగ్గడంతో రుణగ్రహీతలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఆర్థిక కార్యకలాపాలు కుదుటపడే వరకు ఊరట ఇవ్వాలని ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు కోలుకోలేదని, ఇప్పుడే ప్రారంభమైనందున ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు.