లోన్ మారటోరియం తాత్కాలిక పరిష్కారం: ఆర్బీఐ గవర్నర్, రుణాలు తీసుకునే వారు తగ్గారు...
కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి తమ వద్ద అస్త్రాలు పూర్తికాలేదని, అవసరాన్ని బట్టి మరిన్ని నిర్ణయాలు ఉంటాయని, అవసరమైతే వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తామని హింట్ ఇచ్చారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. కరోనా అనంతరం రెండు పర్యాయాల్లో 1.15 శాతం రెపో రేటును తగ్గించింది. ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన వెబినార్ మీటింగ్లో మాట్లాడారు. లోన్ మారటోరియం, బ్యాంకు మోసాల వంటి అంశాలపై కూడా స్పందించారు.
లోన్ మారటోరియం తాత్కాలిక ఊరట
ఆగస్ట్ 31తో ముగియనున్న లోన్ మారటోరియం తాత్కాలిక పరిష్కార మార్గమే అని, దీనిని దీర్ఘకాలికం కొనసాగించలేమని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. 6 నెలల మారటోరియం ముగిశాక మొండిబకాయిలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన ఉందన్నారు. అయితే ఒక కొత్త ప్రణాళిక కింద కొత్త మారటోరియం విధానం తీసుకురావడం లేదా అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత మారటోరియాన్ని కొనసాగించడం వంటి చర్యలను బ్యాంకులు చేపట్టవచ్చునని తెలిపారు. కరోనా అనంతరం కూడా ఆర్బీఐ తన చర్యలను ఏమీ వెనక్కి తీసుకోదన్నారు. బ్యాంకులు తమ రుణ పరిష్కార ప్రణాళికను సమర్థంగా అమలు చేస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీం కూడా రుణగ్రహీతలకు తాత్కాలిక ఊరట అని, ఇది వారికి దీర్ఘకాల ఊరటను ఇవ్వగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
రిస్క్ మేనేజ్మెంట్
మోసాల నుంచి తప్పించుకునేందుకు ఆయా వ్యాపారాల్లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకుల్ని ముందే పసిగట్టాలని బ్యాంకర్లకు శక్తికాందదాస్ సూచించారు. ప్రాథమిక దశలోనే గుర్తించకపోతే అవి భారీస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందన్నారు. రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని, రుణాలు జారీ చేసే సమయంలో, ఆ తర్వాత పకడ్బందీ పర్యవేక్షణ అవసరమన్నారు. అదే సమయంలో బ్యాంకులు నష్టభయంపై మరీ ఎక్కువ స్పందిస్తే కూడా ఇబ్బందికరమే అన్నారు. అది తమకు తామే ఓడిపోవడం వంటిది అన్నారు. అప్పుడు రుణ వ్యవస్థలో వృద్ధి ఉండదన్నారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుంటే మనుగడ సాధించలేవని, అవసరమైన నిధులు సమకూర్చుకోలేవన్నారు. మితిమీరిన రిస్క్ విముఖత కన్నా రిస్క్ నిర్వహణ విధానాలు మెరుగుపరుచుకోవడం మంచిదన్నారు. కరోనా కారణంగా ఎన్పీఏలు పెరిగిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి బ్యాంకర్లలో అప్రమత్తత అవసరమని చెప్పారు.
డిమాండ్ లేదని బ్యాంకులు...
ఇదిలా ఉండగా, రుణాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ డిమాండ్ లేమి కారణంగా తీసుకునే వారు సిద్ధంగా లేరని ప్రయివేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు చెబుతున్నాయి. గతంలో 15 నుండి 16 శాతం ఉన్న రుణ డిమాండ్ ఇప్పుడు 6 శాతం కంటే పడిపోయిందన్నారు. రుణవృద్ధికి, డిమాండ్కు సంబంధం ఉంటుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. రుణానికి తగినంత డిమాండ్ లేదన్నారు. తక్కువ పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఇందుకు కారణమన్నారు. రుణాలకు బ్యాంకులు వెనుకాడటం లేదని, రుణాలకు డిమాండ్ లేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు సీఈవో మల్లికార్జున రావు, యూనియన్ బ్యాంకు సీఈవో రాజ్ కిరణ్ రాయ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీఈవో ఆదిత్య పురి వంటి వారు అన్నారు.