అసంతృప్తి... పూర్తి సమాచారంలేదు: మారటోరియంపై కేంద్రానికి సుప్రీం మరో గడువు
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో రుణగ్రహీతలకు 6 నెలల పాటు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ రుణాలపై వడ్డీపై వడ్డీ మాఫీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. దీనికి సంబంధించి విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం (అక్టోబర్ 5) వాదనలు విన్న జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం... ఆరు నెలల లోన్ మారటోరియం నిషేధ కాలంలో వడ్డీని వదులుకోవాలని సూచించింది. వడ్డీ పైన వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం తెలిపింది.
ఇందుకు సంబంధించి కేంద్రం కేబినెట్ నోట్ను సుప్రీం కోర్టుకు సమర్పించింది. కానీ ఫిడవిట్లో సమగ్ర సమాచారం లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అదనపు అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ఆర్బీఐకి, కేంద్రానికి వారం సమయమిచ్చింది.
లోన్ మారటోరియంకు సంబంధించి మరిన్ని వార్తలు
పాలసీ, అమలు అఫిడవిట్లకు సమయం
రియల్ ఎస్టేట్, బిల్డర్లను అఫిడవిట్లో పట్టించుకోలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ క్రెడాయ్, విద్యుదుత్పత్తిదారులు లేవనెత్తిన సమస్యలు కూడా పరిశీలించాలని సూచనలు చేసిన సుప్రీంకోర్టు, అనంతరం తదుపరి విచారణ అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. అన్ని అఫిడవిట్లను అక్టోబర్ 12వ తేదీ నాటికి సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మరుసటి రోజు ఉంటుందని తెలిపింది. పాలసీ నిర్ణయాలు, అమలు, వడ్డీలు మళ్లీ లెక్కగట్టేందుకు మార్గదర్శకాల జారీ, నోటిఫికేషన్స్, సర్క్యులర్ల జారీ వంటి వాటికి సంబంధించిన వివరాల సమర్పణకు ఈ సమయం ఇచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.
సుప్రీం కోర్టుకు ఏమన్నది...
కేవీ కామత్ ప్యానల్ సిఫార్సులకు సంబంధించి ఏం జరిగిందో అఫిడవిట్లో చెప్పలేదని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని సూచించింది. అయితే ఇందులో దాచడానికి ఏమీ లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దీనికి సుప్రీంకోర్టు స్పందిస్తూ... రిపోర్ట్ను రికార్డ్ చేయడం గురించి సమస్య కాదని, అమలు చేయడం గురించి అని వ్యాఖ్యానించింది. దీని ద్వారా ఏం ప్రయోజనం చేకూరనుందో కేంద్రం రుణగ్రహీతలకు తెలియజెప్పాలని, ఈ మేరకు ఆదేశాలు ఉండాలని పేర్కొంది. లోన్ పునర్నిర్మాణానికి సంబంధించి సూచనలు, సలహాల కోసం సెంట్రల్ బ్యాంకు కేవీ కామత్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో 26 రంగాలకు సహకారం అవసరమని ఈ కమిటీ గుర్తించింది. దీనికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది.
ఇదీ అఫిడవిట్...
చిన్న రుణగ్రహీతల నుండి ఆరు నెలల మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. లోన్ మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీని/చక్రవడ్డీ రద్దు చేస్తామని సుప్రీంకోర్టులో ఇటీవల సమర్పించిన ప్రమాణపత్రంలో కేంద్రం తెలిపింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ ఉండదని స్పష్టం చేసింది. మార్చి నుంచి ఆగస్ట్ మధ్య చెల్లించని రుణాలపై వడ్డీ మీద వడ్డీ భారం పడదని అఫిడవిట్లో పేర్కొంది. దీంతో ఈ నిర్ణయం లక్షలాది రుణగ్రహీతలకు ఊరట లభించినట్లయింది. గతంలో ఎప్పుడూ లేని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వద్ద ఉన్న పరిష్కారం వడ్డీపై వడ్డీ భారాన్ని ఎత్తివేయడమేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ చక్రవడ్డీల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని తెలిపింది. ఇందుకు అవసరమైన గ్రాంట్స్ కోసం పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉందని తెలిపింది.
ప్రభుత్వంపై భారం
లోన్ మారటోరియం కాలానికి సంబంధించి వడ్డీ భారం ప్రభుత్వంపై పడనుంది. కేంద్రానికి రూ.5వేల కోట్ల నుండి రూ.7వేల కోట్ల వరకు ఖర్చు అవుతాయని అంచనా. చక్రవడ్డీ మాఫీకి సంబంధించి క్లెయిమ్స్ వివరాలను బ్యాంకులు, కేంద్రానికి సమర్పిస్తే ప్రభుత్వం నగదును ఖాతాలకు బదలీ చేస్తుంది. ఇందులో వడ్డీని లెక్కించిన విధానాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని మాఫీ ప్రయోజనాన్ని అందిస్తారు. రెండు కోట్ల రూపాయల లోపు ఎంఎస్ఎంఈ రుణాలు, విద్యా, హౌసింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్రెడిట్ కార్డు, ఆటో, పర్సనల్ లోన్స్ తీసుకున్న వారికి అమలు కానుంది.