Loan moratorium: మారటోరియం కాలాన్ని పొడిగించలేం.. సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: రుణ మారటోరియంకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు చెప్పింది. రుణ మారటోరియానికి సంబంధించి పూర్తి వడ్డీని మాఫీ చేయాలని వేసిన పిటిషన్ పైన తీర్పు చెప్పింది. పూర్తి వడ్డీని మాఫీ చేస్తే డిపాజిటర్ల పైన ప్రభావం పడుతుందని, కాబట్టి పూర్తి వడ్డీ మాఫీ సాధ్యం కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే మారటోరియం కాలంలోని లోన్ మొత్తం, వడ్డీ మొత్తాన్ని సర్దుబాటు చేయాలని పేర్కొంది.
ఆర్థిక ప్యాకేజీ, ఉద్దీపనలు ప్రకటించాని ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు తెలిపింది. లోన్ మారటోరియం కాలానికి వడ్డీ పై వడ్డీ(చక్రవడ్డీ), జరిమానా వడ్డీని విధించరాదని పేర్కొంది. అయితే దీనిని పూర్తిగా మాఫీ చేయమని ఆదేశించలేమని వెల్లడించింది. మారటోరియ కాలాన్ని కూడా పొడిగించమని చెప్పలేమని తెలిపింది. ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమన్నది. ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని గుర్తు చేసింది.
కరోనా నేపథ్యంలో రుణాల వసూళ్లపై మారటోరియం పొడిగింపు, రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది ఆర్బీఐ విధించిన మారటోరియం గత ఆగస్ట్తో ముగిసింది. అయితే, బ్యాంకులు మరికొన్ని ఖాతాలను మొండి బకాయిలుగా ప్రకటించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. రుణాలపై వడ్డీ వసూళ్ల మీద మారటోరియం పొడిగించడానికి కేంద్ర ఆర్ధికశాఖ, ఆర్బీఐ నిరాకరించాయి.
విద్యుత్ ఉత్పత్తిదారులు, ఎంఎస్ఎంఈలు దీర్ఘకాలికంగా మారటోరియం ప్రకటించాలని కోరుతున్నాయి. కరోనా ప్రభావం తగ్గించడానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాయి. ఇప్పటికే భారీ రుణగ్రహీతలకు ఇచ్చిన రుణాలను పునర్వ్యవస్థీకరించాలని కామత్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రం వ్యతిరేకించింది. క్రెడిట్ కార్డు యూజర్ల వడ్డీ మాఫీకి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.