World Tour: 135 దేశాలను చుట్టేసే లగ్జరీ షిప్.. ఫీజెంతో తెలిస్తే ఫూజులెగురుతాయ్..!
Life at Sea Cruises: మనలో చాలా మందికి ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరిక ఉంటుంది. అయితే చాలా మందికి సమయం లేకపోవటం పెద్ద సమస్య. అయితే ఒక లగ్జరీ క్రూయిస్ ఏకంగా మూడేళ్ల పాటు 135 దేశాలను సందర్శించే మెగా ట్రావెల్ ప్లాన్ తో ముందుకొచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్రూజ్లో జీవితం..
లైఫ్ ఎట్ సీ క్రూయిసెస్ మూడేళ్ల లగ్జరీ క్రూయిజ్ కోసం బుకింగ్లను ప్రకటించింది. ఇది ఏడు ఖండాల్లోని 135 కంటే ఎక్కువ దేశాలను సందర్శించనుంది. దీనిలో ప్రయాణించే టూరిస్టులకు ఇది సముద్రంపై ఇల్లుగా మారిపోనుంది. పైగా ప్రపంచంలోని 14 వింతల్లో 13 అద్బుతాలను తన టూరిస్టులకు తీసుకెళ్లనుంది. ఒక వ్యక్తికి ఏడాదికి రుసుము 29,999 డాలర్ల నుంచి అత్యధికంగా 1,09,999 డాలర్ల వరకు రుసుముగా ఉండనుంది.
ఓడ విశేషాలు..
భారత కరెన్సీ ప్రకారం ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా తిరిగేందుకు రూ.24.5 లక్షల నుంచి అత్యధికంగా రూ.89.88 లక్షల వరకు రుసుముగా ఉంది. 400 క్యాబిన్లు కలిగిన క్రూయిజ్ దాదాపు 1,074 మంది ప్రయాణికులకు వసతి కల్పించనుంది. లగ్జరీ క్రూయిజ్ షిప్ నవంబర్ 1న ఇస్తాంబుల్ నుంచి బార్సిలోనా, మయామి మీదుగా బయలుదేరుతుందని సమాచారం. ఇందులో టూరిస్టులకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు ఇతర అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.
ప్రయాణ సమయంలో..
ప్రతి ఓడరేవు వద్ద లగ్జరీ క్రూయిజ్ చాలా రోజుల పాటు ఆగనుంది. దీని ద్వారా ప్రయాణికులు తమ ఇష్టానుసారంగా ప్రయాణించి కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందించవచ్చు. ఈ లగ్జరీ క్రూయిజ్ తన ప్రయాణ సమయంలో మొత్తంగా 100 దీవుల వద్ద ఆగనుంది. అదే విధంగా నౌక దక్షిణ అమెరికా, అంటార్కిటికాలో 98 రోజులు గడపనుంది.
సేవల వివరాలు..
క్రూయిజ్ లో ప్రయాణించే సమయంలో లోపల అందించే డిన్నర్, ఆల్కహాల్, శాశ్వత కార్యాలయ స్థలం, తీర విహారయాత్రలు, స్పా సేవలు, వైద్యం, మందులు, ఆన్బోర్డ్లోని కొన్ని సీజనల్ ప్రీమియం సేవలు టిక్కెట్ రుసుములో కలిపి ఉండవని వెల్లడించింది. అంటే ప్రయాణికులు ఈ సేవల కోసం అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.