కూలుతున్న ఎల్ఐసీ: మరో పేటీఎంలా..మహా పతనం దిశగా
ముంబై: జీవిత బీమా సంస్థ షేర్ల ధరల పతనం కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్స్లో ఎల్ఐసీ షేర్ల ధరలు ఇవ్వాళ మరింత దిగజారాయి. ఒక్కో షేర్ ధర 750 రూపాయల వరకు పడిపోయింది. కటాఫ్ ప్రైస్తో పోల్చుకుని చూస్తే- రూ.196.10 పైసల నష్టాన్ని మిగిల్చిందీ లైఫ్ ఇన్సూరెన్స్ జెయింట్. దీని ఫలితంగా ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్పై కుప్పకూలింది. ఎల్ఐసీ స్టాక్స్పై అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది.
లిస్టింగ్ రోజే బిగ్ షాక్..
ఎల్ఐసీ ఐపీఓ లాంచింగ్కు ముందు.. ఆ తరువాత మంచి బజ్ లభించింది గానీ- దాన్ని కాపాడుకోలేకపోయింది. స్టాక్ మార్కెట్స్లో వరస్ట్ పెర్ఫార్మ్గా చేసింది. మైనస్లో లిస్ట్ అయింది. ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. 21,000 కోట్ల రూపాయలను సమీకరించడానికి జారీ అయిన పబ్లిక్ ఇష్యూ ఇది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.902-949 రూపాయలు కాగా 10 శాతం నష్టంతో బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది.
ఇవ్వాళ రూ.23కు పైగా నష్టం..
సోమవారం స్టాక్ మార్కెట్లో రూ.776.50 పైసల వద్ద ఎల్ఐసీ ట్రేడింగ్ ముగియగా.. ఇవ్వాళ- ఈ ధర మరింత పడిపోయింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.752.90 పైసల వద్ద ట్రేడ్ అయింది. కటాఫ్ ప్రైస్ 949 రూపాయలు గా.. ఇవ్వాళ్టి ట్రేడింగ్ ప్రైస్ రూ.752.90 పైసలు. ఒక్కో షేర్ మీద రూ.196.10 పైసల నష్టం నమోదైంది. ఈ ఉదయం రూ.771.40 పైసల వద్ద ట్రేడింగ్ ఆరంభం కాగా.. క్లోజింగ్ సమయానికి రూ.752.90కు దిగజారింది.
రెండు రోజుల్లో 48 రూపాయలు లాస్..
ఈ స్థాయిలో ఎల్ఐసీ షేర్ల ధర పతనం కావడం కొత్తేమీ కాదు. సోమవారం కూడా పెద్ద ఎత్తున నష్టాన్ని మూటగట్టుకుంది. రూ.23.30 పైసల మేర ఎల్ఐసీ షేర్ ధర పడిపోగా.. ఇవ్వాళ ఆ సంఖ్య మరింత పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూ.24.45 పైసలకు పెరిగింది. అంటే ఈ రెండు రోజుల్లోనే ఒక్కో షేర్ మీద 48 రూపాయల వరకు నష్టపోయారు ఇన్వెస్టర్లు. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. పతనం మరింత కొనసాగుతుందనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.
మరో పేటీఎంలా..
ఎల్ఐసీ షేర్లు.. మరో పేటీఎంలా తయారయ్యాయి. పేటీఎం కూడా ఇదే పరిస్థితిలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. 2,150 రూపాయల కటాఫ్ ధరతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పేటీఎం ఒక్కో షేర్ ధర 600 రూపాయలకు పడిపోయింది. ఇవ్వాళ పేటీఎం షేర్ ధర 615.80 పైసల వద్ద ముగిసింది. ఎల్ఐసీ షేర్ల టార్గెట్ ప్రైస్ 875 రూపాయలుగా ఉండొచ్చని, భవిష్యత్లో షేర్ల ధర క్రమంగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కటాఫ్ ప్రైస్ను మాత్రం అందుకోలేదని అంటున్నాయి.