ఎల్ఐసీ స్టాక్ వ్యాల్యూ భారీగా పతనం, ఎం-క్యాప్ రూ.4.5 లక్షల కోట్లకు డౌన్
ఎన్నో అంచనాలతో వచ్చిన ఎల్ఐసీ స్టాక్ వ్యాల్యూ రోజురోజుకు క్షీణిస్తోంది. లిస్టింగ్ రోజునే భారీగా పడిపోయిన ఈ స్టాక్ ధర ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఎప్పుడు లాభాల్లో ట్రేడ్ కాలేదు. దాదాపు ఎక్కువ ట్రేడింగ్ సెషన్లలో నష్టాల్లోనే ముగిసింది. తాజాగా వరుసగా పదో సెషన్లోను పతనమైంది. ఎల్ఐసీ ఐపీవోకు వచ్చినప్పటి నుండి ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.
శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఎల్ఐసీ 1.70 శాతం నష్టపోయి రూ.709.40 వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో రూ.708 స్థాయికి పడిపోయింది. ఈ స్టాక్ కనిష్టం ఇప్పటి వరకు ఇదే. ఎల్ఐసీ స్టాక్ ఇష్యూ ధర రూ.949తో కాగా, లిస్టింగ్ రోజునే రూ.875 స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత ఓ సమయంలో రూ.900 క్రాస్ చేసినప్పటికీ కనీసం లిస్టింగ్ను ఇప్పటి వరకు అందుకోలేదు. పైగా అంతకంతకూ క్షీణిస్తోంది.
ఎల్ఐసీ స్టాక్ ఇప్పటి వరకు 25 శాతం వరకు పతనమైంది. ఎల్ఐసీ మే 17వ తేదీన లిస్ట్ అయింది. అయితే ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే ఈ షేర్లు 8 శాతం నష్టంతో లిస్ట్ అయ్యాయి. ఆ తర్వాత కూడా పతనమవుతోంది. ఇష్యూ ధరతో పోలిస్తే 25.22 శాతం పతనాన్ని చూసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇష్యూ ధరతో రూ.6.02 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం వ్యాల్యూ రూ.4.5 లక్షల కోట్లకు పడిపోయింది.