LIC IPO: మే 4న ఐపీవో, మే 17న లిస్టింగ్: చిదంబరం ఏమన్నారంటే?
భారత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో మే 4వ తేదీన ప్రారంభమై, 9న ముగియనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరిగే ఈ ఐపీవో ద్వారా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయిస్తుంది. ఐపీవోలో విక్రయించే షేర్లకు రూ.902 నుండి రూ.949ని ధరల శ్రేణిగా నిర్ణయించారు. ఇన్వెస్టర్లకు మే 12వ తేదీన షేర్లను కేటాయిస్తారు. 16న డీమ్యాట్ ఖాతాలో జమ అవుతుంది. మరుసటి రోజు మే 17న స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్లు నమోదవుతాయి.
దరఖాస్తు పరిమితి
ఎల్ఐసీ ఐపీవోలో పాలసీదారులకు డిస్కౌంట్ ఉంటుంది. ఉద్యోగులకు రాయితీ ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఐపీవో ఇష్యూ ధరలో పాలసీదారులకు రూ.60, చిన్న ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు రూ.40 నుండి రూ.45 చొప్పున రాయితీ అందిస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 చొప్పున డిస్కౌంట్ ఉంది.
ఒక్కో రిటైల్ ఇన్వెస్టర్ కనీసం 1 గరిష్టంగా 24 లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక లాట్లో పదిహేను షేర్లు ఉంటాయి. దీనికి రూ.14,235 అవుతుంది. చిన్న ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్లు అంటే 210 షేర్లు (రూ.1,99,290)తో దరఖాస్తు చేసుకోవచ్చు.
వ్యాల్యూ సరైనదే.. అందుకే
ఎల్ఐసీ ఐపీవోలో విక్రయించే వాటా వ్యాల్యూ పరిమాణాన్ని రూ.20,557 కోట్లకు తగ్గించడాన్ని సరైన చర్యగా ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ ఐపీవో కోసం మార్కెట్ నుండి పెద్ద ఎత్తున నిధుల ఉపసంహరణ జరగకూడదని కారణంగా తెలిపింది. ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్లకు ఐపీవో ధరల శ్రేణి అందుబాటులో ఉండేలా నిర్ణయించినట్లు తెలిపింది.
వచ్చే ఏడాదిలో మలి విడత ఐపీవోతో ముందుకు వచ్చే యోచనను ప్రభుత్వం చేయలేదన్నారు. నిధుల సమీకరణ పరిమాణాన్ని తగ్గించుకున్నప్పటికీ దేశంలో అతిపెద్ద ఐపీవోగా ఎల్ఐసీ నిలుస్తుందన్నారు.
సరైన సమయం కాదు
ఎల్ఐసీ ఐపీవోపై మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. మార్చి 31, 2022తో గడువు పూర్తయ్యాక ఇప్పుడు ఎల్ఐసీ ఐపీవోను తీసుకు రావాడానికి ప్రభుత్వం ఎందుకు తహతహలాడుతుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎల్ఐసీ ఐపీవోకు ఇది సరైన సమయం కాదన్నారు. ఐపీవో సైజ్ తగ్గించారని, ఆఫర్ ధరను కూడా తగ్గించారని, కాబట్టి ఐపీవోను తీసుకు రావడానికి ఇది సరైన సమయం కాదని ఈ రెండు కూడా సూచిస్తున్నాయన్నారు.