LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు మూడు రెట్ల స్పందన
ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ ఐపీవోకు దాదాపు మూడు రెట్ల స్పందన కనిపించింది. మొదటి రోజు పెద్దగా బిడ్స్ దాఖలు కాకపోయినప్పటికీ చివరి రోజు ఇన్వెస్టర్లు, పాలసీదారులు, సంస్థ ఉద్యోగులు పోటీ పడ్డారు. ఈ నెల నాలుగో తేదీన ప్రారంభమైన ఐపీవో సోమవారం ముగిసింది. ఐపీవోకు 2.95 రెట్ల స్పందన వచ్చింది. అంటే దాదాపు మూడు రెట్ల బిడ్స్ దాఖలయ్యాయి. 16.20 కోట్ల షేర్లకు బిడ్స్ను ఆహ్వానిస్తే 47.83 కోట్ల బిడ్స్ వచ్చాయి.
కేంద్రం ఈ ఐపీవో ద్వారా రూ.20,557 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 16,20,78,067 ఈక్విటీ వాటాలు జారీ చేయగా, 47,83,25,760 షేర్లకు బిడ్స్ వచ్చాయి. రూ.902 నుండి రూ.949 ధరలో ఈ ఇష్యూ మార్కెట్లోకి వచ్చింది. క్విబ్ కోటాలో 2.83 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుండి 2.91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైలర్ల విభాగంలో 6.9 కోట్ల షేర్లకు గాను 13.77 కోట్ల షేర్లు అంటే రెట్టింపు, పాలసీదారుల నుండి 6 రెట్లు, ఉద్యోగుల నుండి 4.4 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి. ఇష్యూ జారీకి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుండి ఎల్ఐసీ రూ.5600 కోట్లను సమీకరించింది.
పాలసీదారులకు రూ.60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 చొప్పున రాయితీ కల్పించారు. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించింది. ఐపీవోలో భాగంగా దరఖాస్తుదారులకు ఎల్ఐసీ షేర్లను ఈ నెల 12న కేటాయిస్తారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఎల్ఐసీ ఈ నెల 17న లిస్ట్ కానుంది. రూ.20,557 కోట్ల సమీకరణ ద్వారా ఎల్ఐసీ అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పింది.