ఎల్ఐసీ ఐపీవో మే 2న వస్తుందా, మరింత ఆలస్యమా?
జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, అయితే మే నెల ప్రారంభ వారంలో పూర్తయితే మాత్రం వాయిదాకు అవకాశాలు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎల్ఐసీ ఇష్యూ జారీచేసే సమయంపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. కేవలం దేశీ ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్ల డిమాండ్ ఆధారంగా ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్తో ముందుకు వెళ్లాలా లేదా అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మార్కెట్లోకి వచ్చేంతవరకు వేచి చూడాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఈ అంశం క్లిష్టంగా మారిందని చెబుతున్నారు.
వాస్తవానికి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను గత ఆర్థిక సంవత్సరం చివరలో అంటే మార్చి నెలలో తేవడానికి సిద్ధపడింది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలతో వాయిదా పడింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబి ఫిబ్రవరిలో అనుమతి ఇచ్చింది. ఐపీవోను తీసుకు రావడానికి మే 12వ తేదీ వరకు గడువు ఉంది. ఈ గడువు దాటితే మళ్లీ అనుమతి కోరాలి.
ఎల్ఐసీలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించాలని ప్రభుత్వం తొలుత భావించింది. రోడ్డుషో లభించే స్పందన ఆధారంగా దీనిని ఏడు శాతానికి పెంచాలనే ఆలోచన కూడా చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను చూస్తుంటే 5 శాతానికి మించి వాటా విక్రయం సాధ్యంకాదని అంటున్నారు. అలాగే ఆఫర్ వ్యాల్యూను తగ్గించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ వాల్యుయర్లు నిర్దేశించిన రూ.5.4 లక్షల కోట్ల ఎంబడెడ్ వ్యాల్యూకు 3 రెట్లు అధికంగా దాదాపు రూ.16 లక్షల కోట్ల వ్యాల్యూతో ఐపీవోను తేవాలని మార్చిలో ప్రతిపాదించారు. మే 2వ తేదీన వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.