నిత్యావసరాల్లోకి ల్యాప్టాప్.. సేల్స్ డబుల్, ఎందుకంటే: 40 శాతం వరకు డిస్కౌంట్
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిత్యావసరాలు మినహా దాదాపు అన్ని సేల్స్ నిలిచిపోయాయి. నిత్యావసరాలతో పాటు మాస్కులు, శానిటైజర్లు వంటి వాటికి డిమాండ్ పెరిగింది. వీటితో పాటు ల్యాప్టాప్స్కు కూడా గిరాకీ పెరిగింది. కంపెనీలు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, పిల్లలకు ఆన్లైన్ క్లాస్లకు మొగ్గు చూపడమే ఇందుకు కారణం.
రూ.98 రీఛార్జ్ ప్లాన్ను నిలిపేసిన జియో, ఇప్పుడు అదే చవకైన ప్లాన్
ఇంటికి ఒక్కటి కాదు...
సాఫ్టువేర్ కంపెనీలు ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కొన్ని కంపెనీలు దీనినే కంటిన్యూ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫీస్ ల్యాప్టాప్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉద్యోగులు కూడా తమ కోసం ఓ ల్యాప్టాప్ అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగులైతే ఇద్దరికీ అవసరమే. కరోనా కారణంగా పిల్లలకు ఆన్ లైన్ క్లాస్లు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లు పిల్లలకు ప్రత్యేక ల్యాప్టాప్ అవసరం లేదని భావించిన వారు కూడా తమ చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 'మా పిల్లలకు ల్యాప్టాప్ అవసరమని మేం ఎప్పుడు భావించలేదు. కానీ ఇప్పుడు కరోనా వల్ల వారికి తప్పనిసరి అని తెలిసింది' అని బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ప్రొఫెషనల్ చెబుతున్నారు.
ల్యాప్టాప్స్ మాత్రమే కాదు..
కరోనా లాక్డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ల్యాప్టాప్స్కు యమ డిమాండ్ పెరిగింది. దీంతో పాటు టెక్ యాక్సెసరీస్, వైఫై రూటర్స్, ప్రింటర్స్ వంటి వాటికి కూడా డిమాండ్ కాస్త పెరిగింది. హాట్ స్పాట్ (కరోనా) కానీ ప్రాంతాల్లో ఇటీవల దుకాణాలు తెరుస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి సేల్స్తో పోలిస్తే ఇప్పుడు దుకాణాలు తెరిచాక అమ్మకాలు చాలా వరకు పెరిగాయట. ఉదాహరణకు ఆసుస్ పదిహేను రోజుల క్రితం వరకు తాము తెరిచిన 100 స్టోర్స్లలో వారం రోజుల్లోనే తమ మొత్తం దుకాణాల సగటులో 50 శాతం అమ్మినట్లు తెలిపింది. 65 శాతం గేమింగ్ ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.
అవసరాలు ఇవే...
లాక్ డౌన్కు ముందే వివిధ కంపెనీలు లేదా వ్యక్తులు వర్క్ ఫ్రమ్ హోమ్కు సిద్ధమై ల్యాప్టాప్స్కు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు అవి మరింత వేగవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంట్లో ల్యాప్టాప్ అవసరం పడుతోంది. అలాగే పిల్లలకు వర్క్, ఆన్ లైన్ క్లాసుల కోసం అవసరం. ల్యాప్టాప్స్ వేర్వేరుగా అవసరమై కొనుగోళ్లు పెరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లల ఆన్ లైన్ స్టడీ కోసం ఈ సంవత్సరం ఈ సేల్స్ ఎక్కువగా ఉండవచ్చునని స్నాప్డీల్ చెబుతోంది. లాక్ డౌన్ నుండి వివిధ రాష్ట్రాల్లో ల్యాప్టాప్స్, మొబైల్స్ యాక్సెసరీస్ డిమాండ్ పెరిగిందంటున్నారు. ఫ్లిప్కార్ట్, కోహినూర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ల్యాప్టాప్, మొబైల్ సేల్స్ గతంలో కంటే 25 శాతం పెరిగినట్లు కోహినూర్ ఎలక్ట్రానిక్స్ తెలిపింది.
నిత్యావసరాల్లోకి ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్
ల్యాప్టాప్స్తో పాటు డెస్క్ టాప్స్ కూడా కొనుగోలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాస్ల వంటి వివిధ కారణాలతో ఇవి కూడా నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేరుతున్నాయని అంటున్నారు. ఐటీ సహా పలు రంగాల్లో ఉద్యోగులకు ఇళ్లలో కూడా డెస్క్ టాప్, ల్యాప్టాప్ తప్పనిసరిగా మారిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే రెండేళ్లు వీటికి డిమాండ్ పెరుగుతుందంటున్నారు.
భారీ డిస్కౌంట్లు
వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసెస్ వంటి వివిధ కారణాలతో ల్యాప్టాప్స్కు డిమాండ్ పెరుగుతున్నందున కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ కార్డులు ఇస్తున్నాయి. హెచ్పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసుస్ వంటి సంస్థలు వ్యక్తిగత కొనుగోలుదార్లకు 15% వరకు తగ్గింపు ఇస్తున్నాయి. అలాగే స్క్రాచ్ కార్డ్తో మొబైల్, ట్యాబ్లెట్ వంటి బహుమతులను, రూ.50,000 వరకు క్యాష్ బ్యాక్, ఎంపిక చేసిన మోడల్స్పై వేలల్లో విలువ చేసే యాక్సెసరీస్ను కూడా అందిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఉదాహరణకు సంస్థలు లేదా ఇనిస్టిట్యూట్స్ పదుల సంఖ్యల్లో ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తే 40 శాతం వరకు, యాక్సెసరీస్ పైన 25 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి.
రుణాలు కూడా..
వ్యక్తిగత కొనుగోలుదార్ల కోసం గతంలో బ్యాంకులు, రుణ సంస్థలు స్పెషల్ స్కీమ్స్ ఆఫర్ చేసేవి. ఆరు నెలల్లో తిరిగి తీర్చేస్తే వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు వసూలు ఉండేవి కావు. డౌన్ పేమెంట్ లేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు బ్యాంకులు వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు పూర్తి నగదు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.