లక్ష్మీ విలాస్ బ్యాాంక్ మహా పతనం: 52 వారాల కనిష్ఠ స్థాయికి క్షీణించిన షేర్ విలువ
ముంబై: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంక్ పరిస్థితి మరింత దిగజారింది. బ్యాంక్ షేర్ల విలువ భారీగా క్షీణించింది. 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. భారతీయ రిజర్వు బ్యాంకు మారటోరియం విధించిన తరువాత.. ఆరంభమైన షేర్ల పతనం శుక్రవారం నాడూ కొనసాగింది. 10 శాతం మేర క్షీణతను నమోదు చేసింది. ఒక్కో షేర్ విలువ 9 రూపాయల వద్ద నిలిచింది. గురువారం నాటి క్లోజింగ్తో పోల్చుకుంటే..0.55 శాతం మేర పడిపోయింది షేర్ విలువ.
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో మధ్యాహ్నం 1.20 నిమిషాలకు లక్ష్మీ విలాస్ బ్యాంకు షేర్ ఒక్కింటికి 9 రూపాయలు పలికింది. ఇదివరకు దీని విలువ 9.55గా నమోదైంది. రిజర్వుబ్యాంకు మారటోరియం విధించిన తరువాత ఈ బ్యాంకు షేర్ల విలువ నేల చూపులు చూడటం ఆరంభించింది. ఎక్కడా ఆగకుండా కనిష్ఠానికి పడిపోయింది. ఈ పరిణామాలు ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తున్నాయి. వచ్చేనెల 16వ తేదీ వరకు మారటోరియం కొనసాగనుండటం, దాన్ని ఎత్తేసిన తరువాత డీబీఎస్ విలీనం చేస్తామంటూ రిజర్వుబ్యాంకు ప్రకటించడం కొంతమేర ఊరట కలిగిస్తోంది.
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వివరాల ప్రకారం.. లక్ష్మీ విలాస్ బ్యాంకునకు 97,245 మంది వ్యక్తిగత షేర్ హోల్డర్లు ఉన్నారు. ఎల్వీబీ హోల్డింగ్స్ సంస్థకు 46.73 శాతం స్టేక్ ఉంది. డీబీఎస్లో విలనంతో అవన్నీ ఆ బ్యాంకునకు బదలాయిస్తారు. ఖాతాదారుల డిపాజిట్లకు ఎలాంటి ముప్పు లేదని అటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇటు రిజర్వుబ్యాంకు భరోసా ఇచ్చింది. డీబీఎస్లో విలీనంతో బ్యాంకు కార్యకలాపాలు మునుపటి స్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నాయి.
మారటోరియం కాలంలో 25 వేల రూపాయల నగదును విత్ డ్రా చేయడానికి రిజర్వుబ్యాంకు ఖాతాదారులకు వెసలుబాటును కల్పించింది. ఇంతకుమించి అధిక మొత్తాన్ని ఖాతాదారులకు చెల్లించాలంటే.. బ్యాంకు యాజమాన్యం ఈ విషయాన్ని ఆర్బీఐకి రాతపూరకంగా తెలియజేయాల్సి ఉంటుంది. రిజర్వుబ్యాంకు లేదా బ్యాంకింగ్ రెగ్యులేటరీ అనుమతి ఇస్తేనే.. 25 వేల రూపాయలకు పైగా మొత్తాన్ని చెల్లించడానికి వీలు ఉంది. పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం రిజర్వుబ్యాంకు అనుమతితో 25 వేల కంటే ఎక్కువ తీసుకోవచ్చు.