Parle: 93 ఏళ్ల పార్లే కంపెనీ ఎలా పుట్టిందో తెలుసా..? బ్రిటీష్ బిస్కెట్లకు పోటీగా నిలిచి.. స్వతంత్ర పోరాటంలో..
Parle G: మనలో పార్లేజీ బిస్కెట్లు తెలియని వారు ఉండరనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మన చిన్ననాటి సాయంత్రపు సమయాల్లో స్నాక్స్ అది. అమ్మా ఆకలేస్తోంది అనగానే ఇదిలో ఈ బిస్కెట్లు తిను అంటూ ఆమె ఇచ్చిన జ్ఞాపకాలు ఇంకా చాలా మంది మదిలో అలాగే ఉండిపోయాయి. ఈ బిస్కెట్ ప్యాకెట్లు ఇప్పటికీ అనేక భారతీయ వంటగదుల్లో భాగంగా కొనసాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పార్లేజీ ప్యాకెట్లపై కనిపించే చిరునవ్వుల చిన్నారి వయస్సు మాత్రం పెరగటం లేదు. ఈ కంపెనీ గురించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పార్లే ప్రారంభం ఇలా..
స్వదేశీ ఉద్యమంలో భాగంగా పార్లే కంపెనీ 1928లో ప్రారంభమైంది. పార్లే కంపెనీని ముంబైకి చెందిన పట్టు వ్యాపారం చేసే చవాన్ కుటుంబానికి చెందిన మోహన్లాల్ దయాల్ స్థాపించారు. మధురై మిఠాయి కంపెనీ కోసం పార్లే ఒక పాత మిఠాయి ఫ్యాక్టరీని కొనుగోలు చేసింది. కంపెనీని ప్రారంభించడానికి ముందు మోహన్లాల్ దయాల్ జర్మనీకి వెళ్లి మిఠాయి తయారీ నేర్చుకున్నారు. దీనితో పాటు జర్మనీ నుంచి రూ.60,000లు వెచ్చించి దిగుమతి చేసుకున్న యంత్రాలను ఉపయోగించి పార్లే సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది.
పేరు పార్లేజీ.. ప్రారంభమైంది విలే పార్లేలో..
మోహన్లాల్ దయాళ్ ఫ్యాక్టరీ ముంబైలోని విలే పార్లేలో ప్రారంభించారు. 12 మందితో కంపెనీ ప్రారంభమైంది. పార్లే మొదట ఆరెంజ్ క్యాండీలను, ఇతర రకాల చాక్లెట్లను తయారు చేసేది. కంపెనీ ముందుకు సాగుతున్నప్పుడు యజమానులు పేరు గురించి ఆలోచించారు. ఆ విధంగా.. కంపెనీ జన్మస్థలమైన విలే పార్లేకు గుర్తుగా.. పార్లే అని పేరును కంపెనీకి పెట్టారు. కంపెనీని ప్రారంభించిన 11 సంవత్సరాల తర్వాత 1939లో పార్లే బిస్కెట్ల తయారీలోకి అడుగు పెట్టింది.
పార్లే గ్లూకో రాక..
పార్లే దేశంలో బిస్కెట్లను విక్రయించడం ప్రారంభించినప్పుడు.. వారు బిస్కెట్లను దిగుమతి చేసుకున్నారు. అధిక ధర కారణంగా బిస్కెట్లు సమాజంలోని ఉన్నతవర్గాల ఆహారంగా మారాయి. దీన్ని బ్రేక్ చేసేందుకు పార్లేకు చెందిన గ్లూకో బిస్కెట్లు మార్కెట్లోకి ప్రవేశించింది. పార్లే గ్లూకో పేరుతో విడుదల చేసిన బిస్కెట్లు తక్కువ ధరకే భారతీయులకు అందుబాటులోకి వచ్చాయి. భారతీయ రుచులతో కూడిన బిస్కెట్లు దేశంలో తక్కువ కాలంలోనే పెద్ద హిట్ అయ్యాయి.
బ్రిటానియా రాకతో..
1960లో బ్రిటానియా కంపెనీ గ్లూకో బిస్టాట్తో మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు పార్లేకు చిన్న ఎదురుదెబ్బ తగిలింది. రెండు కంపెనీల ఉత్పత్తుల పేర్లు ప్రజల్లో గందరగోళానికి కారణమయ్యాయి. వినియోగదారులు దుకాణానికి వెళ్లినప్పుడు గ్లూకో బిస్కెట్లు అడగడం ప్రారంభించడంతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పార్లే కంపెనీ కొత్త ప్యాకేజింగ్తో ముందుకు వచ్చింది. ఈ సమయంలోనే అందమైన అమ్మాయితో పాటు బ్రాండ్ పేరును ముంద్రించింది. కానీ ప్యాకేజింగ్ ఒక్కటే ఈ సంక్షోభాన్ని అధిగమించలేకపోయిందని గ్రహించి 1980లో పార్లే గ్లూకో పేరును పార్లేజీగా కంపెనీ మార్చుకుంది. ప్రస్తుతం పార్లేజీ నెలకు కోటి ప్యాకెట్లను విక్రయిస్తోంది.
ఉత్పత్తి నిలిపివేత..
1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు గోధుమ ఉత్పత్తిని తగ్గించడంతో.. పార్లే కొంతకాలం పార్లే గ్లూకో బిస్కెట్ల ఉత్పత్తిని నిలిపివేయవలసి వచ్చింది. ఈ సమయంలో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించి ఇచ్చిన ఒక ప్రకటనలో గ్లూకో బిస్కెట్లకు బదులుగా బార్లీ బిస్కెట్లను ఉపయోగించాలని పార్లే వినియోగదారులను కోరింది. ఆ సమయంలో బార్లీతో తయారు చేసిన బిస్కెట్లను మార్కెట్లోకి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చింది.