Success Story: వాటర్ కింగ్ సక్సెస్ స్టోరీ.. పిచ్చోడన్న రోజు నుంచి మార్కెట్ లీడర్ గా ఎదిగిన తీరు..
Success Story: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాటిల్డ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ విజయం వెనుక పెద్ద కథ ఉంది. రమేష్ చౌహాన్ నేతృత్వంలోని బిస్లెరీ ఇంటర్నేషనల్ స్థాపించిన మెుదట్లో అందరూ ఆయనకు పిచ్చి అని అనుకున్నారు. కానీ కంపెనీ వ్యాపారం సక్సెస్ అయ్యాక జనానికి పిచ్చిపట్టింది అనటం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇందులో వాటాలు కొనుగోలు చేసేందుకు టాటాలు ప్రయత్నిస్తున్నట్లు వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి.
బిస్లరీ చరిత్ర..
మొదట్లో బిస్లరీ మలేరియా నిరోధక మందులను విక్రయించే ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇంటెల్కు చెందిన వ్యాపారవేత్త ఫెలిస్ బిస్లెరి దీనిని స్థాపించారు. అతని మరణం తరువాత, అతని కుటుంబ వైద్యుడు రోస్సీ బిస్లెరీని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భారతదేశంలో డాక్టర్ రోస్సీ న్యాయవాది ఖుష్రు సంత్కుతో కలిసి బిస్లరీని ప్రారంభించారు. ఆ సమయంలో బాటిల్ నీటిని అమ్మటాన్ని పిచ్చిగా చూసేవారు. సీసాలో నీటిని ఎవరు కొంటారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. 1965లో థానేలో మొదటి బిస్లరీ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.
దేశంలో విస్తరణ ఇలా..
బిస్లరీ మినరల్ వాటర్, సోడా ఉత్పత్తులతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పట్లో సామాన్యులు వాటర్ బాటిల్ కొనడం అసాధ్యమైనది. కానీ ఈ ఉత్పత్తికి ధనిక కుటుంబాల నుంచి మంచి ఆదరణ లభించింది. మొదట్లో ఫైవ్ స్టార్ హోటళ్లు, ఖరీదైన రెస్టారెంట్లలో మాత్రమే బిస్లరీ బాటిల్ లభించేది. అయితే ఆ తర్వాత పెద్ద మలుపు తిరిగింది. డా.రోస్సీ వ్యాపారాన్ని పార్లే కంపెనీకి చెందిన రమేష్ చౌహాన్కు విక్రయించారు. దీంతో 1969లో బిస్లరీని పార్లే కంపెనీ కొనుగోలు చేసింది. అప్పట్లో ఈ డీల్ విలువ రూ. 4 లక్షలకు జరిగింది. ఆ తర్వాత చౌహాన్ దీనిని ప్రతి ఇంటికి చేరువ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మొదట బిస్లరీ ఉత్పత్తులను రైల్వే స్టేషన్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.
బిస్లరీ సామ్రాజ్యం..
దేశవ్యాప్తంగా బిస్లరీకి 122 కంటే ఎక్కువ ప్లాంట్లు ఉన్నాయి. కంపెనీకి 5,000 ట్రక్కులతో పాటు 4,500 పైగా పంపిణీదారుల నెట్వర్క్ను కలిగి ఉంది. దేశంలో ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్ విలువ దాదాపు రూ.20,000 కోట్లకుపైగా ఉంది. వ్యవస్థీకృత మార్కెట్లో బిస్లరీకి 32 శాతం వాటా ఉంది. మినరల్ వాటర్ కాకుండా.. బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రీమియం హిమాలయన్ స్ప్రింగ్ వాటర్ను కూడా విక్రయిస్తోంది.
కంపెనీ అమ్మకం ఎందుకు..
రమేష్ చౌహాన్ 1993లో పార్లే పోర్ట్ ఫోలియోలోని థమ్స్ అప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ వంటి దిగ్గజ బ్రాండ్లను కోకా కోలాకు 60 మిలియన్లకు విక్రయించారు. థంబ్స్ అప్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్గా అవతరించింది. వారసత్వ ప్రణాళికలో భాగంగా బిస్లరీ యజమాని రమేష్ చౌహాన్ కంపెనీలో వాటాను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో వాటాలను విక్రయించాలనుకుంటే భారతీయ సంస్థకే ఈ అవకాశం దక్కుతుందని చౌహాన్ ఇప్పటికే చెప్పారు.