Mukesh Ambani: ముఖేష్ అంబానీ మామిడి తోట కథ మీకు తెలుసా.. ఫుల్ డిమాండ్.. ఎంత లాభమో..
RIL Mango: ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉంది. రిలయన్స్ వ్యాపారం చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉంది. వీటిలో పెట్రోలియం, టెలికాం, రిటైల్ వ్యాపారాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిపండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో రిలయన్స్ ఒకటనే విషయం మనలో చాలా కొంత మందికే తెలుసు. కంపెనీకి గుజరాత్లోని జామ్నగర్లో 600 ఎకరాల మామిడి తోట (రిలయన్స్ మ్యాంగో ఫామ్) ఉంది.
ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. ఈ తోటలో 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి చెట్లను నాటారు. ఈ రకాల్లో కొన్ని ప్రపంచంలోని అత్యుత్తమ రకాలకు చెందినవి. రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించటానికి వెనుక ఒక కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బలవంతంగా మామిడి వ్యాపారంలోకి
రిలయన్స్ సంస్థ కావాలని మామిడి వ్యాపారంలోకి ప్రవేశించలేదు. కానీ అది బలవంతం మీద చేయవలసి వచ్చింది. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్కు రిఫైనరీ ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటి. దీని వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించేందుకు రిలయన్స్ మామిడి తోటను పెంచాల్సి వచ్చింది.
వాస్తవానికి కాలుష్యాన్ని నిరోధించడానికి, కంపెనీకి కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి ఒకదాని తర్వాత ఒకటి అనేక నోటీసులు వచ్చాయి. ఈ విషయం 1997 నాటిది. చివరకు కాలుష్య సమస్యను అరికట్టేందుకు ఏదైనా చేయాలని కంపెనీ భావించింది. ఇందుకోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన అడుగు వేసింది. పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా.. ప్రస్తుతం కంపెనీకి దీనివల్ల ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతోంది.
ప్రతికూల పరిస్థితుల్లోనూ..
రిఫైనరీ సమీపంలో మామిడి తోటను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. జామ్నగర్ రిఫైనరీ సమీపంలోని బంజరు భూమిలో మామిడి చెట్లను నాటే ప్రక్రియను కంపెనీ 1998లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ పై మొదట్లో చాలా అనుమానాలు వచ్చాయి. అక్కడ చాలా బలమైన గాలులు వీయటం, నీరు కూడా ఉప్పగా ఉండటం, భూమి కూడా మామిడి సాగుకు అనుకూలం కాకపోవటం వల్ల అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ కంపెనీ టెక్నాలజీ సహాయంతో ఈ ప్రాజెక్ట్ను విజయవంతం చేసింది. కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పేరు మీదుగా ఈ గార్డెన్కు ధీరూభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ అని పేరు పెట్టారు.
సముద్రపు నీటిని శుద్ధి చేసి..
ఈ తోట 600 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా పరిగణించబడుతోంది. దీని కోసం కంపెనీ డీశాలినేషన్ ప్లాంట్ నుంచి నీరు వస్తుంది. ఈ ప్లాంట్తో సముద్రపు నీటిని శుద్ధి చేస్తారు. నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్, డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతికతలు కూడా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.
కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ రకాలే కాకుండా.. ఈ తోటలో ఇతర దేశాలకు చెందిన రకరకాల మామిడి చెట్లున్నాయి. వీటిలో అమెరికాలోని ఫ్లోరిడా నుంచి టామీ అట్కిన్స్, కెంట్.. ఇజ్రాయెల్లోని లిల్లీ, కీట్, మాయ రకాలు కూడా ఉన్నాయి.
ఎగుమతుల్లో రారాజు..
ఈ తోటలో పండే మామిడి పండ్లను ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. రిలయన్స్ తన తోటలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీపంలోని రైతులకు పరిచయం చేసింది. ప్రతి సంవత్సరం రైతులకు లక్ష చెట్లను పంపిణీ చేస్తోంది. కాబట్టి ఇది విపత్తులో అవకాశాలకు సరైన ఉదాహరణ. ఈ ప్లాంటేషన్ కమాండ్ ముఖేష్ భార్య నీతా అంబానీ చేతిలో ఉంది. ఈ ప్లాంటేషన్లో పండే మామిడికి ఎన్నారై గుజరాతీల నుంచి భారీ డిమాండ్ ఉంది. ధీరూభాయ్ అంబానీకి మామిడి పండ్లంటే చాలా ఇష్టం. స్వయంగా ముఖేష్ అంబానీ కూడా మ్యాంగో లవర్ కావటం విషేషం.
తోటలో మామిడి చెట్లతో పాటు..
రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ 7,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1,627 ఎకరాల్లో గ్రీన్ బెల్ట్ ఉంది. 34 కంటే ఎక్కువ రకాల చెట్లు ఉన్నాయి. వీటిలో 10 శాతం మామిడి చెట్లతో పాటు.. ఇందులో జామ, చింతపండు, జీడి, బ్రెజిలియన్ చెర్రీ, శనగలు, పీచు, దానిమ్మతో పాటు మరికొన్ని ఔషధ చెట్లు కూడా ఉన్నాయి. ఇందులో ఎకరాకు 10 మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఇది బ్రెజిల్, ఇజ్రాయెల్ కంటే ఎక్కువ. రిలయన్స్ తన ప్లాంటేషన్లో పండించిన పండ్లను మార్కెటింగ్ చేయడానికి ప్రత్యేక కంపెనీ జామ్నగర్ ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. కంపెనీ మామిడి పండ్లను RIL మ్యాంగో బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది.