మాల్యా కింగ్ ఫిషర్ హౌస్ను కొనుగోలు చేసిన హైదరాబాద్ రియాల్టీ సంస్థ
బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తలదాడుకుంటున్న భారతీయ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్ను హైదరాబాద్కు చెందిన సాటర్న్ రియాల్టర్స్ కొనుగోలు చేసింది. దేశ ఆర్థిక రాజధాని విల్లే పార్లేలోని కింగ్ ఫిషర్ హౌస్ను డెట్ రికవరీ ట్రైబ్యునల్ (DRT) వేలం వేయగా సాటర్న్ రియాల్టర్స్ రూ.52.25 కోట్లకు దక్కించుకుంది. ఈ భవనాన్ని విక్రయించేందుకు DRT, బెంగళూరు కార్యాలయం ఎనిమిదిసార్లు ప్రయత్నించి విఫలమైంది. అయితే తొమ్మిదోసారి నిర్వహించిన ఈ వేలంలో హౌస్ను విక్రయించింది.
విజయ్ మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు కింగ్ ఫిషర్ హౌస్ ప్రధాన కార్యాలయంగా ఉంది. 2012 అక్టోబర్ నుండి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత నెల 31వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.2.612 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించటం ద్వారా ఈ హౌస్ను సాటర్న్ రియల్టర్స్ హస్తగతం చేసుకుంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల 2,401 చ.మీ. విస్తీర్ణంలో ఈ హౌస్ ఉంది. 2016 నుండి ఈ భవనం ఖాళీగా ఉంది. మొదట DRT ఈ భవనానికి సంబంధించి రిజర్వ్ ధరను రూ.135 కోట్లుగా ఖరారు చేసింది. ఇంత ధర పెట్టడానికి ఎవరు ముందుకు రాకపోవటంతో ధరను తగ్గించింది.
ముంబై ఎయిర్ పోర్ట్కు దగ్గరలోని విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్కు చెందిన ఈ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గర ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వేలంలో అమ్ముడుపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తీసుకు వచ్చింది.