HLL Lifecare: ప్రైవేటీకరణపై మోడీకి ముఖ్యమంత్రి లేఖ
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వం తన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగాన్ని పెంచనుంది. ఇప్పటికే ఎయిరిండియాను ప్రైవేటీకరించింది. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని అమ్మకానికి పెట్టింది. అన్నీ సవ్యంగా సాగివుంటే ఈ పాటికి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వచ్చేదే. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించడం, దాని ప్రభావం స్టాక్ మార్కెట్పై పడటం వంటి కారణాల వల్ల దీన్ని వాయిదా వేయాలనే యోచనలో ఉంది కేంద్రం ప్రభుత్వం.
దీనికి బదులుగా హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ను తెర మీదికి తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది. మినీ నవరత్న హోదా ఉన్న హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఏప్రిల్ 1వ తేదీన ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే దీన్ని ప్రైవేటుకు కట్టబెట్టే అవకాశాలు లేెకపోలేదు. కేరళ రాజధాని తిరువనంతపురం ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న మినీ నవరత్న హోదా ఉన్న కంపెనీ ఇది. హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
దీన్ని ప్రైవేటీకరించడం వల్ల హెల్త్కేర్ సెగ్మెంట్పై పెట్టుబడిదారుల పెత్తనం మరింత తీవ్రతరమౌతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని ప్రభుత్వ పరిధిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తోంది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం హెచ్ఎల్ఎల్ను ప్రైవేటీకరించదలచుకుంటే- దాన్ని తమ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని పట్టుబట్టింది. ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలను తాము పర్యవేక్షించుకుంటామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీనిపై ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులను పంపించింది. హెచ్ఎల్ఎల్ను కేరళ ప్రభుత్వానికి కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది.
ఈ నేపథ్యంలో- తాజాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. హెచ్ఎల్ఎల్ నిర్వహణ, పర్యవేక్షణ, ఆస్తులు, భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అలా కుదరకపోతే- దాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ప్రక్రియ, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ప్రాసెస్లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. హెచ్ఎల్ఎల్ను రాష్ట్రం ఆధీనంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థగా నడిపించుకుంటామని స్పష్టం చేశారు.