కార్వీ కేసు: బ్యాంకులకు ఊరట అప్పీలును తిరస్కరించిన ‘శాట్’
తమ వద్ద తనఖాకు ఉన్న కార్వీ ఖాతాదారుల షేర్లను వారికి బదిలీ చేయడాన్ని సవాలు చేసిన బ్యాంకులకు చుక్కెదురైంది. ఈ విషయంలో బ్యాంకులకు తక్షణ ఊరటనివ్వడానికి సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రైబ్యునల్(శాట్) అంగీకరించక వారి అప్పీల్ను తిరస్కరించింది. ఇప్పటికే ఆ షేర్లు ఖాతాదారులకు చేరిన కారణంగా ఆ సెక్యూరిటీలను తిరిగి రప్పించడం లేదా వాటిని స్తంభింప జేయాలన్న బ్యాంకుల వినతిని అంగీకరించలేమని శాట్ ధర్మాసనం పేర్కొంది.
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ తన ఖాతాదారుల షేర్లను వివిధ బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు పొందిన సంగతి తెలిసిందే. క్లయింట్ల సెక్యూరిటీలను కార్వీ దుర్వినియోగం చేయడంతో కొత్త క్లయింట్లను చేర్చుకోవడంపై నిషేధం విధిస్తూ నవంబరు 22న సెబీ.. కార్వీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సోమవారం సెబీ ఇచ్చిన ఆదేశాల మేరకు 83 వేల మంది ఖాతాదారులకు ఎన్ఎస్డీఎల్ ఎవరి షేర్లు వారికి బదిలీ చేసింది. అయితే మరిన్ని షేర్లు బదిలీ అవకుండా చూడాలంటూ బజాజ్ ఫైనాన్స్ కోరడంతో శాట్ మంగళవారం స్టే రూపంలో ఆ సంస్థకు ఊరట నిచ్చింది.
దీంతో కార్వీకి రుణాలిచ్చిన మిగిలిన బ్యాంకులు కూడా బజాజ్ ఫైనాన్స్తో జత కలిశాయి. ఇప్పటికే సెబీ ఆదేశాలకు అనుగుణంగా కార్వీ డీమాట్ ఖాతదారులలో 90 శాతం మందికి ఎన్ఎస్డీఎల్ షేర్లు బదిలీ చేసేయడంతో ఈ బ్యాంకులన్నీ బజాజ్ ఫైనాన్స్తో కలిసి ఇప్పటికే పిటిషన్ వేశాయి.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ నుంచి క్లయింట్లకు బదిలీ చేసిన షేర్లు తమ వద్ద తనఖాకు ఉండేవని, వాటి ద్వారా కార్వీ తమ వద్ద రుణాలు పొందిందని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్లు చెబుతున్నాయి. ఆ షేర్లను తిరిగి బ్యాంకులకు పంపించాలని.. లేదంటే ఒక ఎస్క్రో ఖాతాకైనా బదిలీ చేయాలని కోరుతూ శాట్ను ఆశ్రయించిన ఈ బ్యాంకులకు నిరాశే ఎదురైంది.
మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన శాట్ ధర్మాసనం.. బుధవారం ఈ కేసులో తుది వాదనలను విన్నది. చివరికి బజాజ్ ఫైనాన్స్ వినతి మేరకు ఇచ్చిన ఆదేశాలకు మించి ఊరట ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పటికే ఎవరి షేర్లు వారికి చేరిపోవడంతో.. తిరిగి వాటిని రప్పించడం లేదా వాటిని స్తంభింపజేయాలన్న బ్యాంకుల వినతిని అంగీకరించలేమని ఎమ్టీ జోషి, సీకేజీ నాయర్లతో కూడిన శాట్ ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.
అంతేకాదు, ఈ విషయమై డిసెంబర్ 6లోగా సెబీకి వెళ్లాలంటూ బ్యాంకులకు సూచించింది. అలాగే వీరి వాదనలను విని డిసెంబర్ 12లోగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కూడా సెబీ శాశ్వత సభ్యుడైన అనంతర బారువాకు సూచించింది. ఇక బజాజ్ ఫైనాన్స్ కేసులో డిసెంబరు 10కల్లా తాజా ఆదేశాలు ఇవ్వాలంటూ సెబీకి కూడా తెలియజేసింది. అలాగే కార్వీ ట్రేడింగ్ లైసెన్సు రద్దు విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని కూడా కోరింది.