మా ఫ్యామిలీ ఆస్తులు అమ్మేస్తాం: కపిల్ రూ.43,000 కోట్ల ఆఫర్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న DHFL సంస్థ ప్రమోటర్ కపిల్ వాధవాన్ రుణ సంస్థలకు ఆఫర్ ఇచ్చారు. తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన రూ.43,000 కోట్ల విలువ ఆస్తులను తమ సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) దివాలా పరిష్కార చర్యలను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను రుణదాతల బకాయిలు చెల్లించేందుకు ఉపయోగిస్తానని ఆఫర్ చేశారు. దివాలా పరిష్కార చర్యల్లో కంపెనీ ఆస్తులకు గరిష్ట విలువ లభించేందుకు దోహదపడాలని ఈ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.
మా ఆస్తులు అమ్మేస్తాం
డీహెచ్ఎఫ్ఎల్ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఆర్ సుబ్రమణియకుమార్కు అక్టోబర్ 17వ తేదీన రాసిన లేఖలో కపిల్ వాధవాన్ ఆఫర్ చేశారు. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రమోటర్లు కపిల్ వాధవాన్, ధీరజ్ వాధవాన్ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. 2006-07 నుండి 017-18 మధ్యకాలంలో రూ.17,394 కోట్ల అక్రమ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రమోటర్లు నిధుల మళ్లింపుకు పాల్పడటంతో రుణదాతలు ఈ కంపెనీ ఖాతాను మోసాల పద్దులో చేర్చారు. అయితే డీహెచ్ఎఫ్ఎల్ తమ చేజారకుండా ప్రమోటర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా లేఖ రాశారు. తమ కుటుంబానికి వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న వాటాలను, హక్కులను బదలాయిస్తామని వాధవాన్ అన్నారు.
ఆ తర్వాత సంక్షోభం
పలు రియాల్టీ ప్రాజెక్టుల్లో తమ కుటుంబ వాటాల యాజమాన్య హక్కుల బదలీకి సిద్ధమన్నారు. ఈ వ్యాల్యుయేషన్ జాబితాలో జుహు గల్లీ ప్రాజెక్టు, ఇర్లా ప్రాజెక్టు ఉన్నాయి. వీటి అన్నింటి విలువ రూ.43,879 కోట్లుగా ఉంటుందన్నారు. వీటి వ్యాల్యూను మార్కెట్ రేటు కంటే 15 శాతం తక్కువ లెక్కగట్టినట్లు తెలిపారు. 2018 సెప్టెంబర్లో ఐఎల్&ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత డీహెచ్ఎఫ్ఎల్ మాత్రమే కాదని, అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కుదేలైనట్లు ఆ లేఖలో వాధవాన్ తెలిపారు. క్లిష్ట సమయంలో వివిధ అనుబంధ సంస్థల్ని విక్రయించడంతో డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ.44,000 కోట్లు చెల్లించిందన్నారు. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, అవాన్స్ ఫైనాన్షియల్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా అసెట్ మేనేజ్మెంట్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా ట్రస్టీ లిమిటెడ్ విక్రయం ద్వారా ఈ బకాయిలు చెల్లించినట్లు తెలిపారు.
డీహెచ్ఎఫ్ఎల్ కొనుగోలుకు ప్రయత్నాలు
డీహెచ్ఎఫ్ఎల్ దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటోంది. దీనిని టేకోవర్ చేసుకునేందుకు ఓక్ట్రీ సహా నాలుగు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. ఓక్ట్రీ కంపెనీ మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు రూ.20,000 కోట్లకు బిడ్ వేసింది. డీహెచ్ఎఫ్ఎల్ రుణసంస్థలకు భారీ మొత్తం చెల్లించాల్సి ఉంది. కంపెనీ చేతిలో ఉన్న నగదుకు ఓక్ట్రీ ఆఫర్ తోడయినప్పటికీ రుణసంస్థలు వేలకోట్లు నష్టపోవాల్సి రావొచ్చు. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా అరవైవేల కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేసుకోవాల్సి రావొచ్చునని బ్యాంకులు అభిప్రాయపడుతున్నాయి.