జియో రూ.149 ప్లాన్లో మార్పు: టాపప్ లేకుండా 300 ని.లు ఫ్రీ
రిలయన్స్ జియో తన రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్లో కొద్ది మార్పులు చేసింది. ఈ ప్లాన్లో కొత్తగా 300 నిమిషాల నాన్ జియో కాలింగ్ మినట్స్ను యాడ్ చేయడంతో పాటు ప్లాన్ కాలపరిమితిని 28 రోజుల నుంచి 24 రోజులకు తగ్గించింది. మిగతా ప్రయోజనాలు యథావిధిగా ఉన్నాయి. రూ.149 ప్లాన్లో జియో నెంబర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్, 300 నిమిషాల నాన్ జియో కాలింగ్ సౌకర్యం, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు, 1.5GB డేటా తదితర ప్రయోజనాలు లభిస్తాయి.
ఇతర నెట్ వర్క్స్కు కాల్ చేసే జియో అకౌంట్ నుంచి నిమిషానికి ఆరు పైసల చొప్పున జియో వసూలు చేస్తోంది. IUC ఛార్జీని టెలికం నియంత్రణ సంస్థ ఎత్తివేసే వరకు వీటిని వసూలు చేయక తప్పదని తెలిపింది. ఇందుకు ప్రత్యేకంగా టాపప్ ఓచర్లు ప్రవేశపెట్టింది. కనీస టాపప్ రూ.10 ఉంది. తాజాగా రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్లో మార్పులతో టాపప్ లేకుండానే 300 నిమిషాల పాటు ఇతర నెట్ వర్క్స్కు కాల్ చేసుకోవచ్చు. అయితే కాల పరిమితి 24 రోజులు.
ఇతర టెలికం ఆపరేటర్లకు చేసే ఫోన్ కాల్ పైన నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై జియో యూజర్లు ఆసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ ఛార్జ్ వసూలు చేసినప్పటికీ ఆ మొత్తానికి గాను డేటా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మాత్రం తాము తమ కస్టమర్లకు ఎలాంటి ఐయూసీ ఛార్జ్ విధించమని స్పష్టం చేసింది.