త్వరలో దేశీయ రిలయన్స్ 5G సేవలు, ప్రపంచ దేశాలకు ఎగుమతి
జియో 5-జీని టెక్నాలజీని దేశంలోనే అభివృద్ధి చేశామని, మన దేశంలో ఈ సేవలను పరిశీలించిన అనంతరం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు. ఆయన ఈ రోజు(జూలై 15, బుధవారం) మధ్యాహ్నం 2గంటలకు రిలయన్స్ 43వ ఏజీఎం వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. జియో తన సేవల విషయంలో వంద శాతం మేథో హక్కులను కలిగి ఉందన్నారు. జియో ద్వారా డిజిటల్ విప్లవాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. మేడిన్ ఇండియా నినాదానికి మరింత సార్థకత చేరుస్తామన్నారు. మెరుగైన ప్రపంచం దిశగా ప్రయాణానికి భారత్ మార్గదర్శిగా ఉంటుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్కు రిలయన్స్ 5G సేవలు అంకితమని ముఖేష్ అంబానీ చెప్పారు. ఈ టెక్నాలజీని దేశీయంగానే తయారు చేశామని, మన దేశంలో పరిశీలించిన అనంతరం విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. దేశంలోని యువ సాంకేతిక నిపుణులే జియోను నిర్మించారని చెప్పారు. ఇది వరల్డ్ క్లాస్ 5జీ సొల్యూషన్స్తో సిద్ధంగా ఉందన్నారు. కరోనా సంక్షోభంలో భారత డిజిటల్ జీవన రేఖగా జియో నిలిచిందన్నారు.
భారత ఎగుమతుల్లో రిలయన్స్దే హవా, గూగుల్ భారీ పెట్టుబడి: ముఖేష్ అంబానీ
జియో ఫైబర్, జియో సెట్ టాప్ బాక్స్ సేవలు సంతృప్తికరంగా ఉన్నట్లు రిలయన్స్ తెలిపింది. జియో టీవీ ప్లస్లో 12 ఓటీటీ కార్యక్రమాలు ఉన్నట్లు రిలయన్స్ తెలిపింది. అకస్మాత్తుగా పెరిగిన బ్రాడ్ బాండ్ అవసరాలను జియో తీరుస్తోందని చెప్పారు. జియో ఫైబర్ ద్వారా 10 లక్షలకు పైగా ఇళ్లకు బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ అందిస్తున్నట్లు తెలిపారు. అందరి అవసరాలు తీర్చే దిశగా జియో సేవలు ఉంటాయన్నారు. రానున్న మూడేళ్ళలో జియోలోకి 50 కోట్లమంది వినియోగదారులు వస్తారని చెప్పారు. వినియోగదారులు, సాంకేతిక విపణిలోకి వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు.