జాక్మాను చైనా పక్కన పెట్టేసినట్లేనా? ఆ జాబితా నుండి ఔట్
చైనా బ్యాంకులు, ప్రభుత్వంపై నోరుజారి చిక్కుల్లోపడిన అలీబాబా అధినేత జాక్ మాకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఆయన టెక్ కంపెనీలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. అంతేకాదు, తాజాగా టెక్ దిగ్గజాల జాబితా నుండి తొలగించినట్లుగా తెలుస్తోంది! ఈ మేరకు చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా న్యూస్ ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీస్ న్యూస్ మంగళవారం తెలిపింది. తమ దేశ టెక్ దిగ్గజాలపై ఓ కథనం ఇచ్చింది. ఇందులో జాక్ మా పేరు కనిపించలేదు.
జనవరి ఆటో సేల్స్: పెరిగిన కారు సేల్స్, మారుతీ సుజుకీ సేల్స్ డౌన్
జాక్ మా పేరు మిస్, టెన్సెంట్ సీఈవోపై ప్రశంసలు
షాంఘై సెక్యూరిటీస్లో వచ్చిన టెక్ దిగ్గజాల కథనంలో జాక్ మా పేరు లేకపోయినప్పటికీ, జాక్ మా నేతృత్వంలోని అలీబాబాకు ప్రత్యర్థిగా ఉన్న టెన్సెంట్ సీఈవో పైన ప్రశంసలు కురిపించింది. టెక్నాలజీలో టెన్సెంట్ అధినేత పోనీ-మా చరిత్ర తిరగరాస్తున్నారని పేర్కొంది. ఈ జాబితాలో బీవైడీ కో చైర్మన్ వాంగ్ చువాన్, షావోమీ సహ వ్యవస్థాపకులు లీ జున్, హువావే అధినేత రెన్ జెంగ్ ఫెయ్ తదితరులు ఉన్నారు. మంగళవారం టెన్సెంట్, వీ-చాట్ స్టాక్స్ దాదాపు రెండు శాతం ఎగిశాయి.
ఒక తరం ఉద్భవించింది
షాంఘై సెక్యూరిటీస్ న్యూస్లో అలీబాబాకు చోటు దక్కకపోవడం గమనార్హం. పేదరికం తొలగిపోవాలనే కోరికతో, వ్యాపార ఆశయ సాధనతో చైనా పారిశ్రామికవేత్తల ఒక తరం ఉద్బవించిందని, ఇది మన పాత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతో సిద్ధమైందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ మద్దతు కలిగిన పత్రిక పేర్కొంది. చైనా ఆర్థిక సంస్కరణలు కొత్త ఊపిరులూదినట్లు తెలిపారు.
కొద్దినెలలుగా జాక్ మా చర్చనీయాంశమే
ఇటీవల చైనా కుబేరుడు, అలీబాబా అధినేత జాక్ మా రెండు నెలలు పాటు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. జాక్ మాతో పాటు అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యాన్ని కొద్ది రోజులుగా చైనీస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. అలీబాబా గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాఫ్తుకు ఆదేశించాయి. గత ఏడాది యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపై దర్యాఫ్తు ప్రారంభించాయి. వివిధ కారణాలు చూపించి యాంట్ గ్రూప్ అతిపెద్ద ఐపీవోకు షాక్ ఇచ్చింది.