Moonlighting: రెండు ఉద్యోగాలకు 'OK' చెప్పిన ఇన్ఫోసిస్.. పండగ చేసుకుంటున్న టెక్కీలు
Infosys: ఐటీ రంగంలో మూన్లైటింగ్ వివాదం కంపెనీల స్థాయి నుంచి ప్రభుత్వాలు స్పందించే స్థాయికి చేరుకుంది. ఇన్నాళ్లుగా మేము తగ్గమంటే మేమూ తగ్గం అన్నట్లుగా కంపెనీలు, ఉద్యోగులు ఈ విషయంపై వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వాతావరణం క్రమంగా మారుతూవస్తోంది. కంపెనీలు సైతం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇన్ఫోసిస్ అనుమతి..
కంపెనీ బయట ఉద్యోగులు రెండో ఉద్యోగం చేసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. 'గిగ్ జాబ్స్' చేసుకోవటానికి కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. గురువారం ఈ-మెయిల్ ద్వారా కంపెనీ ఈ సమాచారాన్ని అంతర్గతంగా ఉద్యోగులకు వెల్లడించింది. అయితే దీనిని మూన్లైటింగ్గా కంపెనీ పేర్కొనలేదు.
ఇబ్బంది లేకుండా..
అదనపు డబ్బు సంపాదించాలనుకునే ఉద్యోగుల కోసం ఇన్ఫోసిస్.. పరిస్థితులను సులభతరం చేయాలనుకుంటోంది. ఎవరైనా ఇన్ఫోసిస్ ఉద్యోగి గిగ్ వర్క్ని చేపట్టాలనుకుంటే.. ముందుగా వారు తమ మేనేజర్, BP-HR నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కంపెనీ స్పష్టం చేసింది. ఆఫీసు పని వేళల తర్వాత కంపెనీ వెలుపల వ్యక్తిగత సమయంలో మాత్రమే దీనిని అనుమతిస్తోంది.
ఆ పని చేయెుద్దంటూ..
ఆఫీసు ఫిప్ట్ పూర్తి చేసుకున్న తర్వాత.. వేరే పని చేసుకోవటానికి అమతించినప్పటికీ.. సిబ్బంది ఇన్ఫోసిస్ లేదా దాని క్లయింట్లతో పోటీపడే సంస్థలతో పనిచేయకూడదంటూ నిషేధించబడింది. రెండో పని చేస్తున్నవారు.. కంపెనీ పని విషయంలో అలసత్వం వహించటం లేదా పని సామర్థ్యం ప్రభావితం కాకూడదని తెల్చి చెప్పింది.
'మూన్లైటింగ్'VS'గిగ్ వర్క్'..
మూన్లైటింగ్, గిగ్ వర్క్ మధ్య వత్యాసం ఉంది. అందుకే కంపెనీ ప్రస్తుతం అందిస్తున్న వెసులుబాటును గిగ్ వర్క్ అని వ్యవహరిస్తోంది. గిగ్ వర్క్ అంటే ప్రస్తుత ఉద్యోగానికి అదనంగా కంపెనీ అనుమతితో చేసుకునే రెండో ఉద్యోగం. మూన్లైటింగ్ అంటే కంపెనీ యాజమాన్యానికి తెలపకుండా.. వారి అనుమతి లేకుండా సీక్రెట్ గా చేస్తున్న రెండో ఉద్యోగం అని సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఈ రెండింటిలో తేడా కేవలం కంపెనీ అనుంతి మాత్రమే.
వ్యతిరేకిస్తున్నవి..
విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, IBM మాత్రం ఈ రెండు ఉద్యోగాల విధానాన్ని ఇప్పటికీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన ఉద్యోగులు రెండు ఉద్యోగాలు చేసుకోవచ్చని ఇప్పటికే తెలిపింది. ఇదే క్రమంలో టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ సైతం తమ ఉద్యోగులు సెకండరీ జాబ్ చేసుకోవటంపై తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ గత నెల స్పష్టం చేశారు.