Wipro: వీకెండ్లో శుభవార్త చెప్పిన విప్రో.. 96% ఉద్యోగులకు లబ్ధి.. ఐటీ ఉద్యోగుల్లో ఆనందం..
Wipro: భారతదేశంలోని 4వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో గత 3 నెలలుగా పలు వివాదాల్లో కూరుకుపోయింది. మెున్నటికి మెున్న 300 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విప్రో.. టెక్కీలకు మంచి కిక్ ఇచ్చే వార్త ఒకటి చెప్పింది. పండుగలకు కొద్ది రోజుల ముందు వచ్చిన Salary Hikes ప్రకటనతో ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆనందం నెలకొంది.
మార్చి 31 తర్వాత..
అనేక వివాదాల తర్వాత తాజాగా.. విప్రో తన ఉద్యోగులకు మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం తర్వాత అర్హలైన ఉద్యోగులకు జీతాలను పెంచాలని నిర్ణయించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ టెక్ కంపెనీ సెప్టెంబర్ నుంచి వేతన పెంపును ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
96 శాతం మందికి..
అయితే ఈ జీతాల పెంపును ఉద్యోగులందరికీ ఇవ్వటం లేదు. కేవలం కంపెనీలోని 96 శాతం మందికి మాత్రమే అందిస్తోంది. 4 శాతం మంది ఉద్యోగులు సెలవులో ఉన్నారని, వారికి జీతాల పెంపు ఇవ్వలేదని కూడా వివరించారు. మెుత్తానికి ఎక్కువ మంది మాత్రం పండుగకు శుభవార్త విననున్నారు.
విప్రో ఉద్యోగులు..
గత ఆర్థిక సంవత్సరం జీతాల పెంపునకు సంబంధించి విప్రో ఉద్యోగులకు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఈ-మెయిల్ పంపారు. మేనేజర్ నుంచి వచ్చే వారంలో ఇంక్రిమెంట్లకు సంబంధించి లేఖలు అందుకుంటారని వెల్లడించారు.
ఆలస్యం..
అదే విధంగా విప్రోలో, C1 బ్యాండ్ పైన ఉన్న ఉద్యోగులందరికీ గతేడాది జూన్లో జీతం పెంపు ఇవ్వబడింది. అయితే ఈ సంవత్సరం అది సెప్టెంబర్లో జరుగుతోంది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో మధ్య, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్లకు వేరియబుల్ వేతనాన్ని నిలిపివేయాలని అప్పట్లో నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే.
టీసీఎస్ ఉద్యోగుల పరిస్థితి..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గత సంవత్సరం 6-8% మధ్య జీతాల పెంపును అందించింది. FY22 కోసం పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లను పరిశీలిస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ గోపీనాథన్ ఏప్రిల్లో తెలిపారు. TCS సాధారణంగా ఏప్రిల్ నుంచి తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను అమలు చేస్తుంది.
ఇన్ఫోసిస్ సంగతేంటి..?
బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు జీతాలను పెంచే ఉద్యోశ్యంలో ఉన్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ వెల్లడించారు. కంపెనీ ఏప్రిల్ నుంచి పెంపుదలలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పండుగ వేళ ఐటీ కంపెనీల్లోని ఉద్యోగుల్లో ఆనందం కనిపిస్తోంది. కంపెనీలు మార్జిన్ల విషయంలో, మూన్ లైటింగ్ వివాదంతో హీట్ ఎక్కిన ఐటీ రంగంలో జీతాల పెంపు ఉద్యోగులకు పెద్ద ఊరటను అందించనుంది.