Moonlighting: మూన్లైటింగ్ అనుమతించం.. ఉద్యోగులను తొలగించిన మరో ఐటీ కంపెనీ..
Happiest Minds: మూన్లైటింగ్ ను చాలా కంపెనీలు పరిశ్రమకు పట్టిన చీడపురుగులా భావిస్తున్నారు. ఇన్నాళ్లు దేశంలోని అగ్ర ఐటీ కంపెనీలు మాత్రమే వీటిపై స్పందించటం, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఉద్యోగులను తొలగించటం చేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలోని ఇతర కంపెనీలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. మరికొన్ని ఇప్పటికే తీసుకున్న చర్యల గురించి ప్రకటనలు కూడా చేస్తున్నాయి.
కొత్తగా చర్యలు..
మిడ్-టైర్ ఐటి కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ మూన్లైటింగ్ వివాదంపై తొలిసారి స్పందించింది. ఒకేసారి రెండు ఉద్యోగాలు ఆమోదయోగ్యం కాదని కంపెనీ పేర్కొంది. ఇది ఉద్యోగ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని వెల్లడించింది. ఇలాంటి పనుల్లో నిమగ్నమైన ఉద్యోగులను తమ కంపెనీ నుంచి గడచిన 6-12 నెలల్లో తొలగించినట్లు స్పష్టం చేసింది.
పెద్ద తలనొప్పి..
మూన్ లైటింగ్ వ్యవహారం చాలా ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పిన హ్యాపీయెస్ట్ మైండ్స్.. ఎంత మందిని తొలగించిదనే సంఖ్యను వెల్లడించలేదు. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీ ఈ విషయంపై దూకుడు పెంచిన నాటి నుంచి ఇతర ఐటీ కంపెనీలు సైతం సమస్యపై నోరు విప్పుతున్నాయి.
సూపర్ లాభాలు..
సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికానికి హ్యాపీయెస్ట్ మైండ్స్ మంచి లాభాలను నమోదు చేసింది.లాభాల్లో వృద్ధి ఏడాది ప్రాతిపదికన 33.7 శాతం పెరగగా, కంపెనీ ఆదాయం 31.1 శాతం మేర పెరిగింది. సెప్టెంబర్ 30, 2022 నాటికి కంపెనీలో దాదాపు 4581 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
వైస్ ఛైర్మన్ సీరియస్..
మూన్లైటింగ్ లేదా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ పై కంపెనీ ప్రతినిధి సీరియస్ గా స్పందించారు. ఇలాంటివి తాము అస్సలు అంగీకరించబోమనే విషయాన్ని తమ ఉద్యోగులకు స్పష్టం చేసినట్లు హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జోసెఫ్ అనంతరాజు అన్నారు. ఎవరైనా ఉద్యోగి.. ఒక కంపెనీలో పనిచేసేందుకు అంగీకరించినప్పుడు.. కేవలం అక్కడ మాత్రమే పనిచేయటానికి అంగీకరిస్తున్నట్లన్నారు.
అందుకే ఆఫీసులకు..
మూన్లైటింగ్ భద్రతకు సంప్రదించిన విషయమని కంపెనీ చెబుతోంది. దీనివల్ల పనిపై ఉద్యోగుల నిబద్ధత, శ్రద్ధ తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉందని కంపెనీ తెలిపింది. అది అంతిమంగా కంపెనీకి చేటు చేస్తుందని చెబుతోంది. అయితే తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు తీసుకురావటానికి మూన్లైటింగ్ ఒక కారణమని వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ ఉద్యోగుల్లో 67 శాతం మంది గడచిన మూడు నెలలుగా ఆఫీసులకు వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.