రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
వచ్చే నెల నుంచి రైళ్లలో ఈ-క్యాటరింగ్ సర్వీసులను పునరుద్దరించనున్నట్లు ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ లిమిటెడ్) వెల్లడించింది. ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి నుంచి దశలవారీగా ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గతేడాది మార్చి 22,2020 నుంచి ఐఆర్సీటీసీ ఈ-క్యాటరింగ్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 10 నెలల తర్వాత ఐఆర్సీటీసీ ఈ సేవలను తిరిగి పునరుద్దరించనుంది.ఐఆర్సీటీసీ 2014లో ఈ-క్యాటరింగ్ సేవలను ప్రారంభించింది. దీని ప్రకారం... ప్రయాణికులు తమకు నచ్చిన ఫుడ్ కంపెనీ నుంచి ఫోన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ఫుడ్ నేరుగా రైల్లోని ప్రయాణికుల సీటు వద్దకే డెలివరీ చేస్తారు.
కరోనా లాక్ డౌన్ కంటే ముందు.. ప్రతీరోజూ ఐఆర్సీటీసీలో 20వేల ఈ-క్యాటరింగ్ ఆర్డర్స్ వచ్చేవి. తాజాగా ఈ సర్వీసును పునరుద్దరించనున్న నేపథ్యంలో మునుపటి లాగే ఆర్డర్స్ వస్తాయా లేక కరోనా ఎఫెక్ట్ ఉంటుందా అన్నది చూడాలి. గత కొద్ది నెలలుగా దేశంలో రైలు సర్వీసులను పునరుద్దరించినప్పటికీ కేవలం 'రెడీ టు ఈట్' మీల్స్ను మాత్రమే ఐఆర్సీటీసీ ప్రయాణికులకు అందిస్తోంది.
రైళ్లలో ఈ-క్యాటరింగ్ కోసం తమతో టైఅప్ అయిన ఫుడ్ కంపెనీలు సరైన ప్రమాణాలు,ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకుంటామని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణికులు www.ecatering.irctc.com వెబ్సైట్ ద్వారా ఈ క్యాటరింగ్ సర్వీసును పొందవచ్చు. లేదా ప్రయాణికులు తమ ఫోన్ నుంచి 1323 నంబర్కు ఫోన్ చేసి తమ ఆర్డర్ను బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఈక్యాటరింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా... ఆర్డర్ ఎంత సమయంలో డెలివరీ వస్తుంది... ఎక్కడి వరకు వచ్చిందన్నది అందులో మానిటర్ చేయవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫుడ్ ఆర్డర్స్పై క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని కూడా ఐఆర్సీటీసీ కల్పించింది.